
పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. స్కాట్లాండ్కు చెందిన యూట్యూబర్ కాలమ్ మిల్ తన పాకిస్తాన్ పర్యటనలో తీసిన వీడియోలో జ్యోతి లాహోర్ మార్కెట్లో ఆరుగురు గన్మెన్లతో కలిసి నడుస్తున్న దృశ్యాలు కనిపించాయి.
ఈ వీడియో ‘కాలమ్ అబ్రాడ్’ అనే ఛానల్లో ప్రచురించడం జరిగింది. ఇందులో లాహోర్లోని ప్రసిద్ధ అనార్కలి బజార్లో కాలమ్ మిల్ తిరుగుతుండగా, జ్యోతి మల్హోత్రా అతని దృష్టికి వచ్చారు. అప్పటివరకు కనిపించిన గన్మెన్లను మిల్ ఒకరి తర్వాత ఒకరు వివరించగా, వీరిలో చాలా మంది ఆకుపచ్చ యూనిఫాంలు ధరించి, AK-47 రైఫిళ్లతో కనిపించారు.
వీడియోలో జ్యోతి ఆరుగురు భద్రతా సిబ్బందితో కలిసి నడుస్తూ కనిపించిందని మిల్ పేర్కొన్నాడు. అంతేకాదు, జ్యోతి తనకు పాకిస్తాన్ గురించి ఏమంటావు అని ప్రశ్నించగా, దీనిపై ఆమె "అది అద్భుతం" అని స్పందించింది.
విదేశీయుడితో జరిపిన సంభాషణలో జ్యోతి, పాకిస్తాన్పై తన ప్రేమను వ్యక్తపరిచింది. ఆతిథ్యం అద్భుతంగా ఉందని చెప్పింది. మరోవైపు, మిల్ మాత్రం తన వీడియోలో భారత యువతికి ఇంత భద్రత ఎందుకు అవసరమైందో అర్థం కావడం లేదన్న వ్యాఖ్య చేశాడు.
హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా ఇటీవల గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన 12 మంది భారతీయుల్లో ఒకరు. ఈ ఘటన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లలోని గూఢచర్య నెట్వర్క్పై దృష్టిని కేంద్రీకరించింది. పోలీసులు ఆమెను అరెస్టు చేసిన తర్వాత కస్టడీ ముగిసిన వెంటనే జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
ఈ వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో జ్యోతి కేసు మరోసారి హాట్ టాపిక్గా మారింది. భారత పౌరురాలు పాక్లో గన్మెన్లతో ఎందుకు తిరుగుతుందన్న చర్చలు నడుస్తున్నాయి. అధికార వర్గాలు ఈ కేసును సమగ్రంగా విచారిస్తున్నాయి.