
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం అందించిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ దోషిగా తేలారు. ఢిల్లీలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు యాసిన్ మాలిక్ను ఈ కేసులో దోషిగా తేల్చింది. యాసిన్ మాలిక్ ఇటీవలే తనపై మోపిన ఉపా కేసు సహా అన్ని అభియోగాలకు వ్యతిరేకంగా వాదించాలని భావించడం లేదని పేర్కొన్నారు. తద్వార తనపై మోపిన అభియోగాలన్నింటినీ అంగీకరించినట్టు అయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా, ఎన్ఐఏ కోర్టు ఆయనను టెర్రర్ ఫండింగ్ కేసులో దోషిగా తేల్చింది. అయితే, ఆయనకు శిక్షను ఖరారు చేయలేదు. ఈ నెల 25వ తేదీన శిక్ష తీవ్రతను ఖరారు చేయనుంది.
అంతేకాదు, ఆయన ఫైనాన్షియల్ అసెస్మెంట్ను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన నివేదికను సమర్పించాలని ఎన్ఐఏకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ యాసిన్ మాలిక్కు విధించే శిక్షపై వాదనలు వింటారు. మే 25న ఈ వాదనలు వింటారు.
యాసిన్ మాలిక్పై పలు అభియోగాలు దాఖలు అయ్యాయి. కుట్రపూరిత ప్రణాళికలు చేయడం, దేశానికి వ్యతిరేకంగా యుద్ధాన్ని రచించడం, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలు, కశ్మీర్లో శాంతియుత వాతావరణాన్ని భంగం చేయడం వంటి అభియోగాలు యాసిన్ మాలిక్పై ఉన్నాయి.
చివరి సారి ఆయనపై దాఖలైన కేసుల విచారణ జరుగుతున్నప్పుడు యాసిన్ మాలిక్ తన నేరాలను అంగీకరించారు. ఆయనపై నమోదైన టెర్రరిస్టు యాక్ట్ కింద నమోదైన కేసు, ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం, ఉగ్రవాదం చేపట్టడానికి కుట్ర, టెర్రరిస్టు సంస్థలో సభ్యత్వం, దేశద్రోహం, ఉపా చట్టాల కింద యాసిన్ మాలిక్పై అభియోగాలు నమోదయ్యాయి.
యాసిన్ మాలిక్ సహా కశ్మీరీ వేర్పాటువాదులు షబ్బీర్ షా, మసరాత్ అలామ్, మాజీ ఎమ్మెల్యే రషీద్ ఇంజినీర్, వ్యాపారి జహూర్ అహ్మద్ షా వతాలి, బిట్ట కరాటే, అఫ్తబ్ అహ్మద్ షా, అవతార్ అహ్మద్ షా, నయీమ్ ఖాన్, బషీర్ అహ్మద్ భట్, అలియాస్ పీర్ సైఫుల్లా సహా మరెందరో నేరపూరిత కుట్ర, దేశానికి వ్యతిరేకంగా యుద్ధం, చట్టవిరుద్ధ కార్యకలాపాల అభియోగాలను ఎదుర్కొంటున్నారు.
అయితే, ఈ అభియోగాల నుంచి ముగ్గురిని కమ్రాన్ యూసుఫ్, జావేద్ అహ్మద్ భట్, సయేదామ్ ఆసియా ఫిర్దోస్ అంద్రాబీలను నిర్దోషులుగా కోర్టు విడిచిపెట్టింది. ఈ కేసు ఐఎస్ మద్దతు ఉన్న లష్కర్ ఎ తాయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కేసు. ఉగ్రవాద చర్యలు, జమ్ము కశ్మీర్లో అశాంతి కలిగించడం, వేర్పాటువాద కార్యక్రమాలు చేపట్టడం వంటి ఆరోపణలు ఈ కేసులో ఉన్నాయి.