భోపాల్: మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎంలుగా జగదీష్ దేవదా, రాజేంద్ర శుక్లాలను బీజేపీ ప్రకటించింది. అదే విధంగా మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా నరేంద్ర తోమర్ పేరును భారతీయ జనతా పార్టీ నాయకత్వం ప్రకటించింది.
బీజేపీ శాసనసభపక్ష సమావేశం సోమవారంనాడు భోపాల్ లో జరిగింది.ఈ సమావేశానికి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్,ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, కార్యదర్శి ఆశాలక్రా లు పరిశీలకులుగా వెళ్లారు. ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు బీజేపీఎల్పీ నేతగా మోహన్ యాదవ్ పేరును బీజేపీ నాయకత్వం ప్రకటించింది.ఆ తర్వాత జగదీష్ దేవదా, రాజేంద్ర శుక్లాలను డిప్యూటీ సీఎంలుగా ఆ పార్టీ ప్రకటించింది.
2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జగదీష్ దేవదా మల్హర్ ఘర్ నియోజకవర్గం నుండి 59.024 ఓట్ల తేడాతో ఇండిపెండెంట్ అభ్యర్ధి శ్యామ్ లాల్ జోక్ చంద్ పై విజయం సాధించారు. 2008, 2013, 2018 ఎన్నికల్లో కూడ ఇదే నియోజకవర్గం నుండి ఆయన గెలుపొందారు.
1990, 1993, 2003 ఎన్నికల్లో రాష్ట్రంలోని సువాసరా అసెంబ్లీ నుండి జగదీష్ దేవదా ప్రాతినిథ్యం వహించారు.