
తిరువనంతపురం: రాకెట్ ప్రయోగించడానికి ముందు దాని నమూనాను ఆలయానికి తీసుకెళ్లి అర్చన చేయించడం ఈ మధ్య తరుచూ కనిపిస్తున్నది. స్వయంగా ఇస్రో శాస్త్రవేత్తలే ఆలయాలకు వెళ్లి దేవుడి ఆశీస్సులు తీసుకోవడం వార్తల్లో కనిపిస్తున్నదే. అయితే.. ఒక శాస్త్రవేత్త అయి ఉండి, శాస్త్రవిజ్ఞానం తెలిసి ఉండి మళ్లీ మతాలను నమ్మడమేమిటీ? అనే చర్చ ఈ వార్తలు వచ్చినప్పుడల్లా జరిగింది. చంద్రయాన్ 2 సమయంలోనూ చంద్రయాన్ 3 సందర్భంలోనూ ఇస్రో శాస్త్రవేత్లు ఆ ప్రాజెక్టు నమూనాలను గుడిలోకి తీసుకెళ్లి దైవం చెంత ఉంచి ప్రార్థనలు చేశారు. చంద్రయాన్ 3 విజయవంతమైన తర్వాత కూడా తాజాగా, ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ఓ ఆలయంలో కనిపించారు. సైంటిస్టులు టెంపుల్కు వెళ్లడంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ను ఆలయాలకు వెళ్లడం గురించి ప్రశ్నించింది. అందుకు సోమనాథ్ సమాధానాలు ఇలా ఇచ్చారు.
జులై 13న తిరుపతిలోని చెంగాలమ్మ ఆలయంలో చంద్రయాన్ 3 కోసం ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ప్రార్థనలు చేశారు. ఈ రోజు కేరళ తిరువనంతపురంలోని పౌర్ణమికావు భద్రకాళి టెంపుల్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. శాస్త్రవిజ్ఞాననం, ఆధ్యాత్మికత రెండూ కూడా వేర్వేరు రంగాలని వివరించారు. ఈ రెంటినీ కలపాల్సిన అవసరం లేదని తెలిపారు.
Also Read: చంద్రుడిపై ఉష్ణోగ్రత ఎంతో తెలుసా?: చంద్రయాన్-3 ఫలితాలను వెల్లడించిన ఇస్రో
ఈ రెండు భిన్న దృష్టి కోణాల మధ్య స్వాభవిక ఘర్షణ ఏమీ లేదని అన్నారు. ‘నేను అణ్వేషకుడిని. చంద్రుడిని అన్వేషిస్తాను. నేను అంతరంగాన్ని కూడా అన్వేషిస్తాను. ఇది సైన్స్, స్పిరిచువాలిటీలను అన్వేషించే నా జీవిత గమనం. అందుకే నేను అనేక ఆలయాలు సందర్శిస్తాను. మరెన్నో పురాణ రచనలను చదివాను. మన అస్తిత్వానికి అర్థాన్ని వెతికే ప్రయత్నం చేస్తాను. అదే విధంగా ఈ ఖగోళంలో ప్రయాణానికీ అర్థాన్ని వెతుకుతాను. ఇదంతా మన సంస్కృతిలో భాగమే. మన అంతరాళంలో, బాహ్య ప్రపంచంలో అన్వేషణ చేయడం సంస్కృతిలోనే ఉన్నది. కాబట్టి, ఔటర్ సెల్ఫ్ కోసం సైన్స్, ఇన్నర్ సెల్ఫ్ కోసం ఆలయాలను సందర్శిస్తాను’ అని సోమనాథ్ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి తెలిపారు.