ఇండోనేషియాలో కూలిన విమానం... పైలెట్ మనవాడే..

By ramya neerukondaFirst Published Oct 29, 2018, 12:26 PM IST
Highlights

దిల్లీలోని మయూర్‌ విహార్‌ ప్రాంతానికి చెందిన సునేజా 2011లో లయన్‌ ఎయిర్‌ సంస్థలో పైలట్‌గా చేరారు. ఆయన ఎక్కువగా బోయింగ్‌ 737 విమానాన్నే నడిపేవారు. 

ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ విమాన పైలెట్ మన దేశానికి చెందిన వాడుగా తెలిసింది. ఇండోనేషియాలో 188 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న లయన్‌ ఎయిర్‌ విమానం జావా సముద్రంలో కుప్పకూలింది. 

జకార్తా విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొద్ది క్షణాలకే ఈ ప్రమాదం సంభవించింది. దిల్లీకి చెందిన భవ్యే సునేజా అనే 31 ఏళ్ల వ్యక్తి ఈ విమానానికి పైలట్‌‌గా వ్యవహరించారు. సునేజా చాలా అనుభవమున్న పైలట్‌ అని అతని సన్నిహితులు, లయన్‌ ఎయిర్‌ అధికారులు చెబుతున్నారు.

దిల్లీలోని మయూర్‌ విహార్‌ ప్రాంతానికి చెందిన సునేజా 2011లో లయన్‌ ఎయిర్‌ సంస్థలో పైలట్‌గా చేరారు. ఆయన ఎక్కువగా బోయింగ్‌ 737 విమానాన్నే నడిపేవారు. ‘సునేజాతో జులైలో చర్చలు జరిపాం. అతని స్వస్థలం దిల్లీ కావడంతో అక్కడికే పోస్టింగ్‌ ఇప్పించాలని కోరారు. అతను చాలా మంచి వ్యక్తి. చాలా అనుభవమున్న పైలట్‌. ఇప్పటివరకు పైలట్‌గా అతని రికార్డులో ఎలాంటి లోపాలు లేవు. ఇన్ని నైపుణ్యాలు ఉన్నాయి కాబట్టే అతన్ని ఇండోనేసియాకు చెందిన లయన్ ఎయిర్‌ సంస్థలోనే ఉంచాలనుకున్నాం. కానీ తన కుటుంబం కోసం స్వస్థలానికి పోస్టింగ్‌ ఇప్పించాలని అడిగారు. మా సంస్థలో పనిచేసే పైలట్లంతా ఉత్తర భారత్‌కు చెందినవారే. వారు కూడా దిల్లీ పోస్టింగే కావాలని అడిగేవారు. దాంతో సునేజా అభ్యర్ధనను వెంటనే అంగీకరించలేకపోయాం. ఏడాది తర్వాత దిల్లీ పోస్టింగ్‌ ఇస్తామని చెప్పాం. సునేజాతో పాటు విమానంలో ఉన్న ప్రయాణికులు, ఇతర సిబ్బంది క్షేమంగా బయటపడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం.’ అని లయన్‌ ఎయిర్‌ అధికారులు వెల్లడించారు.

read more news

ఇండోనేషియాలో సముద్రంలో కూలిన విమానం.. విమానంలో 200 మంది

click me!