
India-UAE trade deal: ఇటీవల భారత్-యూఏఈ దేశాల వర్చువల్ సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోడీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పాల్గొన్నారు. ఈ సమ్మిట్ సందర్భంగా భారత్-యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై రెండు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంతో రెండు దేశాలలోని ఆర్థిక వ్యాపారాలు, విద్యా, ఉపాధి, సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడానికి సహాయపడుతుందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. రెండు దేశాలు వృత్తిపరమైన సంస్థలు & విద్యా సంస్థల పరస్పర గుర్తింపును కోరుకుంటున్నాయని తెలిపారు. ఐఐటీ క్యాంపస్లను ఏర్పాటు చేయవచ్చో లేదో తెలుసుకోవడానికి యూఏఈ ఆసక్తి చూపిస్తున్నదని వెల్లడించారు. రెండు దేశాల ఒప్పందంలో భాగంగా స్టూడెంట్ ఎక్సేంజ్ ప్రొగ్రామ్ లపై కూడా ఈ ఒప్పందంలో చర్చకు వచ్చాయని తెలిపారు.
ఫిబ్రవరి 18 భారత్-యూఏఈల మధ్య కుదిరిన సరికొత్త ఈ వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఆర్థిక, ఉపాధి, విద్యా వంటి అనేక విషయాల్లో ఇరు దేశాలకు లాభం చేకూరుతుందని రెండు దేశాల ప్రతినిధులు పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా భారత విద్యా సంస్థలను యూఏఈలో ఏర్పాటు చేయడం, విద్యార్థులు మార్పిడి కార్యక్రమం, ప్రొఫెషనల్ బాడీను సేవలను ఇచ్చిపుచ్చుకోవడం వంటి అంశాలపై కూడా చర్చ జరిగిందని కేంద్ర మంత్రి పియూస్ గోయల్ ప్రకటించారు. భారతదేశం-యూఏఈ వాణిజ్య ఒప్పందంలో భాగంగా దుబాయ్లో మొదటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. భారతదేశ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అయిన ఐఐటిని విదేశాల్లో స్థాపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ & విదేశీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి థానీ బిన్ అహ్మద్ అల్ జియోదీ నేతృత్వంలోని యూఏఈ ప్రతినిధి బృందం సమక్షంలో భారత్-యూఏఈ లు వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాయి.
UAE-భారత్ల మధ్య కుదిరిన ఈ ఒప్పందంతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA).. అన్ని రంగాలలో ఉమ్మడి వ్యూహాత్మక సహకార కొత్త దశకు దారితీసే ఒక ముఖ్యమైన మైలురాయి అని UAE మంత్రులు, సీనియర్ అధికారులు పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య లోతుగా పాతుకుపోయిన చారిత్రక సంబంధాలపై రూపొందించిన ఈ ఒప్పందం, 'ప్రాజెక్ట్స్ ఆఫ్ ది 50'లో భాగంగా ప్రారంభించబడిన UAE అంతర్జాతీయ ఒప్పందాల అభివృద్ధి కార్యక్రమంలో మొదటిది. అబుదాబి క్రౌన్ ప్రిన్స్-యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్-భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య జరిగిన వర్చువల్ సమ్మిట్ తర్వాత ఈ ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం టూ-వే కామర్స్ 100 బిలియన్ డాలర్ల మార్కును చేరుకోవడానికి దోహదపడుతుందనీ, భారత్-యూఏఈలో ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుందని పీయూష్ గోయల్ తెలిపారు. ఇది భారతీయ-UAE వ్యాపారాలకు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో మెరుగైన మార్కెట్ యాక్సెస్, తగ్గిన టారిఫ్లు ఉంటాయి. CEPA ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వచ్చే ఐదేళ్లలో ప్రస్తుత $60 బిలియన్ల నుండి $100 బిలియన్లకు పెంచుతుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందంలో వీసాల అంశం కూడా ఉంది. సమగ్ర వాణిజ్య ఒప్పందం ప్రకారం భారతీయుల కోసం సరళీకృత వీసాలను అందించడానికి రెండు దేశాలు అంగీకరించాయి.