
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. గత కొద్దిరోజులుగా కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 5,335 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం డేటాను విడుదల చేసింది. గత 195 రోజులలో రోజువారి కరోనా కేసులలో ఇదే అత్యధికం. ఇక, తాజా కేసులతో దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 25,587 కు పెరిగింది. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.47 కోట్లు (4,47,39,054)కు పెరిగింది.
తాజాగా కరోనాతో 13 మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 5,30,929కి పెరిగింది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి 4,41,82,538 కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 3.32 శాతంగా నమోదైందని, వీక్లి పాజిటివిటీ రేట్ 2.89 శాతంగా ఉందని కేంద్రం పేర్కొంది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం.. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య.. మొత్తం కేసులలో 0.06 శాతంగా ఉన్నాయి. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.75 శాతంగా నమోదైంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్లు ఇవ్వబడ్డాయి.