
ఆపరేషన్ సింధూర్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. దీంతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోయింది. పదే పదే భారత్ పై దాడి చేసి, దెబ్బలు తింటోంది. ఈ క్రమంలోనే గురువారం రాత్రి పాకిస్తాన్ ఉక్రోషానికి గురై భారీ దాడి చేసింది.భారత సరిహద్దు నగరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. భారత వైమానిక రక్షణ వ్యవస్థ ఈ దాడులను అడ్డుకుంది. క్షిపణులు, డ్రోన్లను కూల్చివేసింది. వార్తల ప్రకారం, ఈ క్రమంలో భారత వైమానిక రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ యొక్క మూడు యుద్ధ విమానాలను (2 JF-17లు, 1 F-16 ఫైటర్ జెట్) కూల్చివేసింది. పాకిస్తాన్ కి చెందిన ఒక AWACS (ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్) విమానం కూడా ధ్వంసమైంది. ఇది పాకిస్తాన్ కి పెద్ద దెబ్బ. ఒక AWACS విమానం నష్టం అనేక యుద్ధ విమానాల నష్టం కంటే తీవ్రమైనది. పాకిస్తాన్ వద్ద ఇలాంటి విమానాలు చాలా తక్కువ.
వార్తల ప్రకారం, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లో AWACS విమానం ఎగురుతుండగా దాన్ని కూల్చివేశారు. దీంతో శత్రువుకి భారత వైమానిక రక్షణ వ్యవస్థ, ముఖ్యంగా S-400 సామర్థ్యం బాగా అర్థమైంది. S-400 వద్ద AWACS విమానాన్ని 400 కి.మీ. దూరం నుంచి కూల్చివేసే క్షిపణులు ఉన్నాయి. దీంతో AWACS విమానం భారత సరిహద్దుకు చేరుకోకముందే ధ్వంసమైంది.
AWACS పూర్తి పేరు ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. ఇది గాల్లో ఎగురుతూ రాడార్ స్టేషన్ లా పనిచేసే విమానం. దీని రాడార్ చాలా దూరం వరకు చూడగలదు. ఈ విమానం గాల్లో ఎగురుతూ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లా పనిచేస్తుంది. యుద్ధ సమయంలో ఫైటర్ జెట్ లతో పాటు AWACS విమానాలు కూడా ఎగురుతాయి. ఇవి వెనకాల ఉండి యుద్ధ విమానాలకు దిశానిర్దేశం చేస్తాయి. శత్రు దేశ విమానం ఎక్కడుందో, దాన్ని ఎలా ఎదుర్కోవాలో చెబుతాయి.
యుద్ధ సమయంలో AWACS విమానాలు తమ యుద్ధ విమానాలకు క్షణక్షణం సమాచారం అందిస్తాయి. వాటికి దిశానిర్దేశం చేస్తాయి. దీని ద్వారా నేల, నీటిపై ఉన్న కేంద్రాలకు కూడా సమాచారం అందుతుంది. ఆధునిక యుద్ధంలో ఈ విమానం అనేక కీలక పాత్రలు పోషిస్తుంది. AWACS విమానం క్షణక్షణం వైమానిక క్షేత్రాన్ని పర్యవేక్షిస్తుంది. ఇది వందలాది లక్ష్యాలను గమనించగలదు. యుద్ధ విమానాలు, వైమానిక రక్షణ వ్యవస్థలతో సమన్వయం చేస్తుంది. ఈ లక్షణాల వల్ల దీన్ని గాల్లో కన్ను అని కూడా అంటారు.
పాకిస్తాన్ వద్ద 9 AWACS విమానాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇది స్వీడన్ నుంచి Saab 2000 Erieye విమానాలను కొనుగోలు చేసింది. Saab 2000 Erieye 360 డిగ్రీల కోణంలో నిఘా వేస్తుంది. ఇది తన చుట్టూ, పైన, కింద అన్ని వైపులా చూడగలదు. దీని ద్వారా 5 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 60 వేల అడుగుల ఎత్తు వరకు నిఘా వేయవచ్చు.
భారత్ తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో AWACS కూలిపోవడం పాకిస్తాన్ కి మరో దెబ్బ. దీంతో పాకిస్తాన్ వైమానిక దళం వైమానిక నిఘాకు ఆటంకం ఏర్పడుతుంది. భారత్-పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం గాల్లో ఘర్షణ జరుగుతోంది. AWACS ధ్వంసంతో భారత్ కు పైచేయి దక్కింది. మేము ప్రమాదాన్ని అడ్డుకోవడమే కాదు, శత్రువుకి గట్టి దెబ్బ కూడా తీయగలమని భారత్ చాటి చెప్పింది.