అది దేశం సాధించిన అతిపెద్ద విజ‌యాల్లో ఒక‌టి.. 80వ స్వాతంత్ర దినోత్స‌వం వేళ రాష్ట్ర‌ప‌తి సందేశం

Published : Aug 14, 2026, 08:55 PM IST
Independence Day

సారాంశం

Independence Day: 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆమె దేశం సాధించిన ప‌లు విజ‌యాల గురించి ప్ర‌స్తావించారు.

నక్సల్స్‌ రహిత భారత్‌ దిశగా కీలక ముందడుగు

దేశంలో నక్సలిజం ప్రభావాన్ని తగ్గించడం, నక్సల్స్‌ రహిత భారత్‌ దిశగా సాధించిన పురోగతి ముఖ్యమైన విజయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఒకప్పుడు తీవ్ర ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రత్యేకంగా బస్తర్‌ వంటి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు స్థానిక ప్రజల భాగస్వామ్యం పెరగడం సానుకూల మార్పున‌కు సంకేతమని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి, శాంతి రెండూ కలిసి ముందుకు సాగినప్పుడే దేశంలోని ప్రతి ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.

ఉగ్రవాదంపై కఠిన వైఖరి.. సైనిక సామర్థ్యానికి ప్రశంస

దేశ భద్రత విషయంలో భారత్ ఎలాంటి రాజీ పడదనే విషయాన్ని రాష్ట్రపతి తన ప్రసంగంలో స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించే వ్యక్తులు, సంస్థలు ఎక్కడ ఉన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని ప్రస్తావిస్తూ ఆపరేషన్ సిందూర్ సందర్భంగా సైన్యం చూపించిన క‌చ్చితమైన లక్ష్య ఛేదన సామర్థ్యం ప్రపంచానికి భారత రక్షణ శక్తిని చాటిచెప్పిందని ప్రశంసించారు. దేశ సరిహద్దులను రక్షించడంతో పాటు అంతర్గత భద్రతను కాపాడటం కూడా అత్యంత కీలకమని పేర్కొన్నారు.

రాజ్యాంగం, న్యాయవ్యవస్థపై ప్రతి ఒక్కరికీ బాధ్యత

దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగం పునాది అని రాష్ట్రపతి గుర్తుచేశారు. భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. చట్టసభలు, న్యాయవ్యవస్థ వంటి ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు నమ్మకం ఉండేలా వ్యవస్థలు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక పరిస్థితులు, వనరుల కొరత కారణంగా ఏ పౌరుడూ న్యాయానికి దూరం కాకూడదని రాష్ట్రపతి స్పష్టం చేశారు. సామాన్యులకు సైతం సకాలంలో న్యాయం అందినప్పుడే ప్రజాస్వామ్య విలువలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు.

అంబేద్కర్‌ ఆశయాల నుంచి వికసిత్‌ భారత్‌ వరకు

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అందించిన రాజ్యాంగ విలువలు, సమానత్వం, సామాజిక న్యాయం వంటి ఆశయాలను ప్రజలు గుర్తుంచుకోవాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజలందరూ తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. జాతీయ గీతాలు, దేశ చరిత్ర, స్వాతంత్ర పోరాట విలువలను గౌరవించాలని కోరారు. వందేమాతరం గీతానికి కూడా గౌరవం ఇవ్వాలని రాష్ట్రపతి సందేశం ఇచ్చారు. భారత్‌ 80వ స్వాతంత్ర దినోత్సవంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దేశ భద్రత, శాంతి, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలతో ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మధ్యాహ్నం 2 గంటలకు హైకోర్టును పేల్చేస్తాం.. స్వాతంత్ర దినోత్సవం వేళ బాంబు బెదిరింపు
Independence Day: స్వాతంత్రం వ‌చ్చినప్పుడు భార‌త‌దేశ జ‌నాభా ఎంతో తెలుసా.?