CJP: మ‌ళ్లీ ఉద్యమం బాట ప‌డుతోన్న కాక్రోచ్ పార్టీ.. ఈసారి కేవ‌లం ఢిల్లీకే ప‌రిమితం కాదు

Published : Aug 13, 2026, 04:30 PM IST
CJP

సారాంశం

CJP: దేశ రాజధాని దిల్లీలో 36 రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మరోసారి ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈసారి కేవలం ఢిల్లీకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వామ్యం చేయ‌న్నారు.

36 రోజుల ఆందోళన తర్వాత మరో ఉద్యమం

గతంలో జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన దీర్ఘకాలిక నిరసనకు కొనసాగింపుగా ఇప్పుడు రెండో దశ ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు అభిజీత్ దీప్కే ప్రకటించారు. సోషల్ మీడియాలో ‘జంతర్ మంతర్ సీజన్-2’ ఎప్పుడు ప్రారంభమవుతుందంటూ అనేక మంది ప్రశ్నిస్తున్నారని, వారికి త్వరలోనే సమాధానం లభిస్తుందని ఆయన తెలిపారు. అయితే తదుపరి ఉద్యమం కచ్చితంగా ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఏయే డిమాండ్లను కేంద్రంగా చేసుకుంటుందనే పూర్తి కార్యాచరణను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇటీవల ఢిల్లీలో సీజేపీ వాలంటీర్ల సమావేశాన్ని నిర్వహించేందుకు ప్రయత్నించినప్పటికీ చివరి నిమిషంలో అది రద్దయింది. సమావేశం కోసం నారాయణ ప్రాంతంలోని ఓ హాల్‌ను బుక్ చేసుకున్నామని, అయితే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నిర్వాహకులు బుకింగ్‌ను రద్దు చేశారని దీప్కే ఆరోపించారు.

ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్త ‘లిజనింగ్ టూర్’

సీజేపీ తదుపరి కార్యాచరణ కేవలం ఒక నిరసన కార్యక్రమంగా ఉండదని పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు వారి అభిప్రాయాలను సేకరించేందుకు దేశవ్యాప్తంగా ‘ప్రజల మాట విందాం యాత్ర’ తరహా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 15 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు.

ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని ఉద్యమ అంశాలుగా మార్చడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. దీంతో సీజన్-2 ఒకే ప్రాంతంలో జరిగే నిరసనకు బదులుగా వివిధ రాష్ట్రాల్లో ప్రజలను కలుస్తూ సాగించే ప్రచార కార్యక్రమంగా రూపుదిద్దుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రభుత్వ పాఠశాలల సమస్యలే ప్రధాన అజెండాగా?

ఇటీవలి కాలంలో అభిజీత్ దీప్కే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలు, పాఠశాలలకు అవసరమైన భవనాలు, రహదారులు వంటి అంశాలపై తరచూ స్పందిస్తున్నారు. దీంతో సీజేపీ కొత్త ఉద్యమంలో విద్యా రంగానికి పెద్దపీట వేయవచ్చన్న చర్చ మొదలైంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం, పాఠశాలలకు రాకపోకలు సులభతరం చేయడం వంటి అంశాలను దేశవ్యాప్తంగా ప్రజల ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం నుంచి విద్యకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సౌరవ్ దాస్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ అంచనాలకు బలం చేకూరుస్తున్నాయి.

విద్యార్థుల ఆందోళనలకు దీప్కే మద్ధతు

విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తూ అభిజీత్ దీప్కే ఇటీవల పలు ప్రాంతాల్లో జరిగిన నిరసనలకు మద్ధతు తెలిపారు. జార్ఖండ్‌లో విద్యార్థులు చేపట్టిన ఆందోళనను ప్రస్తావిస్తూ, వారు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా తమ హక్కుల కోసం పోరాడుతున్నారని అన్నారు. విద్యార్థుల ఆందోళనలపై పోలీసుల వ్యవహారశైలిని కూడా ఆయన ప్రశ్నించారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో పాఠశాలకు సరైన రహదారి కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు చేపట్టిన పాదయాత్రపైనా దీప్కే స్పందించారు. సుమారు 300 మంది విద్యార్థులు, 100 మంది తల్లిదండ్రులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వర్షాకాలంలో రహదారి దుస్థితి వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాలకు వెళ్లేందుకు కనీస రవాణా సౌకర్యం కల్పించాలనే డిమాండ్ ఇప్పటికీ వినిపించాల్సి రావడం బాధాకరం అని దీప్కే పేర్కొన్నారు.

సీజన్-2 వెనుక అసలు వ్యూహం ఏంటి?

సీజేపీ ప్రకటించిన కొత్త కార్యక్రమాన్ని పరిశీలిస్తే, పార్టీ తన ఉద్యమాన్ని ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రచారంగా విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిపై ప్రభుత్వాలను ప్రశ్నించాలన్నది పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.

అయితే ‘జంతర్ మంతర్ సీజన్-2’లో అసలు డిమాండ్లు ఏమిటి, ఏ రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు, నిరసనల రూపం ఎలా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వాన్ని ఏ అంశాలపై నిలదీస్తారు వంటి వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడించాల్సి ఉంది. ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న దేశవ్యాప్త కార్యక్రమం ద్వారా ఈ అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో గతంలో జంతర్ మంతర్ వద్ద సాగిన ఉద్యమానికి భిన్నంగా సీజేపీ కొత్త దశలో ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయనుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Russia India Train Route: పెద్ద స్కెచ్చే వేశారు.. భారత్ నుంచి పాకిస్తాన్ మీదుగా ఆ దేశానికి రైల్వే లైన్
జంతర్ మంతర్ సీజన్2 రాబోతోంది: అభిజిత్ దీప్కే | Jantar Mantar Season 2 | Cockroach Janta Party