
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నిక్కీ యాదవ్ హత్యపై నివేదిక సమర్పించాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) పోలీసులను ఆదేశించింది. నిక్కీ యాదవ్, సాహిల్ గెహ్లాట్లు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. సాహిల్ గెహ్లాట్ ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఇలాంటి ఘటనలు జరగడంలో కేవలం ఆ యువతులదే కాదు.. కుటుంబాల పాత్ర కూడా ఉన్నదని ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ పేర్కొన్నారు.
‘లివ్ ఇన్ రిలేషన్షిప్లో మహిళలు సురక్షితంగా లేరని మనం ఇప్పుడు ఫీల్ అవుతున్నాం. ఇలాంటి ఘటనలకు కేవలం యువతులే కాదు.. కుటుంబాలు కూడా బాధ్యత వహించాలి. మహిళలకు తమ భాగస్వాములను ఎంచుకునే హక్కు ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు తగ్గుతాయి’ అని ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ ఏఎన్ఐతో అన్నారు.
‘ఇలాంటి ఘటనలపై పోలీసులు, కుటుంబాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబాలు లివ్ ఇన్ రిలేషన్స్ను అంగీకరించాలి. ఈ కేసులో అన్ని ప్రధానమైన చర్యలను తీసుకుంటాం’ అని ఆమె తెలిపారు.
నిక్కీ యాదవ్ హత్య కేసు మరోసారి శ్రద్ధా వాకర్ హత్యను గుర్తుకు తెస్తున్నది. దేశవ్యాప్తంగా ఆమె మర్డర్ కలకలం రేపుతున్నది. నాలుగేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్న బాయ్ఫ్రెండ్ ఆమెకు తెలియకుండా మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. తర్వాతి రోజే పెళ్లి. ఈ విషయం తెలుసుకున్న గర్ల్ఫ్రెండ్ నిలదీయడంతో గొడవ జరిగింది. ఈ ఘర్షణలోనే ఆగ్రహంతో ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఆమె డెడ్ బాడీని వారి ధాబా దగ్గర కారులోనే ఉంచి ఏమీ ఎరుగనట్టు పెళ్లి చేసుకోవడానికి వెళ్లాడు. బంధువులతో కలిసి స్టెప్పులు వేశాడు. పెళ్లి చేసుకుని రాత్రి మళ్లీ బయటకు వచ్చి గర్ల్ ఫ్రెండ్ బాడీని ఓ నదిలో లేదా కెనాల్లో పడేయడానికి ధాబాకు వచ్చాడు. ఒక వైపు పెళ్లి తంతులో పాల్గొంటూనే అదే సమయంలో ఇంకో వైపు గర్ల్ఫ్రెండ్ను హత్య చేయడం, ఆమె డెడ్ బాడీని మాయం చేసే ప్లాన్లు వేయడం వంటివి చేశాడు.