
ఆడపిల్లల దుస్తులపై బీజేపీ నాయకుడు కైలాష్ విజయవర్గియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు వేసుకొనే బట్టలపై ప్రశ్నలు సంధిస్తూ.. మంచి బట్టలు వేసుకోవాలని, లేకపోతే శూర్పణఖలా కనిపిస్తారని అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జైన సమాజ్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ వివాదాస్పద ప్రకటన చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అందులో కైలాష్ విజయవర్గీయ మాట్లాడుతూ.. ‘‘మేము మహిళలను దేవతలు అని పిలుస్తాము. అయితే వారు మంచి దుస్తులు ధరించనప్పుడు వారిలో దేవతల రూపాన్ని చూడలేం. దానిక బదులు వారు శూర్పణఖగా కనిపిస్తారు.’’ అని అన్నారు. దీంతో పాటు ఆయన మత్తుకు బానిసలైన యువకులను ఉద్దేశించి కూడా మాట్లాడారు. అలాంటి వారి చెంప చెల్లుమనిపించాలని తనకు అనిపిస్తుందని అన్నారు. ఎంతో మంది యువకులు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘నేను రాత్రి కారులో ఇంటికి బయలుదేరిన సమయంలో విద్యావంతులైన యువకులు, పిల్లలు మాదకద్రవ్యాల మత్తులో ఉండటం చూస్తున్నాను. నేను (కారు నుండి) దిగి వారి మత్తును వదిలించడానికి ఐదు నుంచి ఏడు సార్లు చెంపదెబ్బ కొట్టాలని అనిపిస్తుంటుంది. దేవుడిపై ప్రమాణం చేస్తున్నాను, నేను హనుమాన్ జయంతి నాడు అబద్ధం చెప్పను.’’ అని అన్నారు.
దేవుడు అమ్మాయిలకు ఎంతో అందమైన శరీరాన్ని ఇచ్చాడని విజయవర్గీయ అన్నారు. దేవుడు ఇచ్చిన శరీరం నిజంగా బాగుందని, మంచి బట్టలు వేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు విలువలు ఇవ్వాలని ఆయన సూచించారు. ‘‘ విద్య అవసరం లేదు. సంస్కృతి అవసరం. భోజనం చేసే ముందు మేము మా తల్లిదండ్రులకు రామాయణ ద్విపదలు చెప్పేవాళ్లం. అప్పుడు తినడానికి ఆహారం దొరికింది. అందుకే బాగుపడ్డాం, లేకుంటే ఎక్కడో నంద నగర్ లో తిరుగుతూనే ఉండేవాళ్లం.’’ అని అన్నారు. అయితే విజయ్వర్గియా వివాదాస్పద ప్రకటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.