అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట వేడుక ఘనంగా జరిగింది. ఆలయంలో ప్రతిష్టించిన బాల రాముడి విగ్రహం, దాని రూపకర్త అరుణ్ యోగి గురించి దేశమంతా మాట్లాడుకుంటోంది. కానీ ఈ విగ్రహం తయారు చేసే శిలను కనుగొన్న కాంట్రాక్టర్ కు మాత్రం ఎలాంటి గుర్తింపు దక్కకపోగా.. ఆ పని చేసినందుకు అధికారులు ఆయనకు ఫైన్ వేశారు. దానిని చెల్లించేందుకు తన భార్య తాళి బొట్టు తాకట్టు పెట్టాల్సి వచ్చింది.
స్థానిక మీడియా సంస్థల కథనం ప్రకారం.. రాం లల్లా విగ్రహాన్ని చెక్కేందుకు ఉపయోగించిన కృష్ణ రాయిని కర్ణాటక రాష్ట్రంలోని హారోహళ్లి-గుజ్జేగౌడన్పుర గ్రామానికి చెందిన గని కాంట్రాక్టర్ అయిన శ్రీనివాస్ నటరాజ్ గుర్తించారు. బుజ్జేగౌడనపురలోని దళిత రైతు రాందాస్ పొలంలో ఉందని గుర్తించి, ఆయనతో ఒప్పందం చేసుకున్నారు. యంత్రాలు, కూలీలు పెట్టి ఓ పెద్ద శిలను బయటకు తీశారు. దీనిని మూడు భాగాలుగా విభజించారు. దీనిలో ఒక భాగాన్ని మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ తీసుకెళ్లి రామ్ లల్లా విగ్రహాన్ని చెక్కారు. అన్ని ఖర్చులూ పోను ఆయనకు రూ.25 వేలు మిగిలింది.
అయితే అక్రమంగా మైనింగ్ చేశారని ఆరోపిస్తూ మైన్స్ అండ్ జియాలజీ శాఖ శ్రీనివాస్ కు రూ.80 వేల ఫైన్ విధించింది. ఫైన్ చెల్లించకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది. కానీ ఆ డబ్బు చెల్లించేందుకు ఆయన వద్ద డబ్బులు లేకపోవడంతో తన భార్య మెడలో ఉన్న తాళిబొట్టును తాకట్టు పెట్టి ఫైన్ చెల్లించారు. కాగా.. అప్పటికే తనకు పెళ్లయి ఎనిమిది నెలలు మాత్రమే అవుతోందని, కానీ విధిలోని పరిస్థితుల్లో మెడలోని తాళిని ఇలా తాకట్టు పెట్టాల్సి వచ్చిందని శ్రీనివాస్ కన్నీటి పర్యంతయ్యారు.
శిలను అప్పగించే ముందు కొందరు ఇన్ఫార్మర్లు డిపార్ట్మెంట్కు సమాచారం అందించారని, అందుకే ఫైన్ వేశారని తెలిపారు. అయితే తనకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సాయం అందిస్తారని తాను ఎదురు చూస్తున్నానని వెల్లడించారు. కాగా.. రాంలల్లా విగ్రహాన్నిసేకరించిన భూమికి యజమాని అయిన 70 ఏళ్ల దళిత రైతు రాందాస్ కు ఇటీవల రాముడి ఆలయ నిర్మాణానికి ఆ పొలంలోని కొంత భాగాన్ని విరాళంగా ఇచ్చారు.
రాందాస్ కు ఆ ప్రాంతంలో 2.14 ఎకరాల భూమి ఉంది. అయితే అందులో వ్యవసాయం చేసేందుకు, సాగుకు అనుకూలంగా మార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ భూమిని చదును చేయడంలో విఫలయ్యారు. దీంతో అందులోని రాళ్లను తొలగించేందుకు శ్రీనివాస్ కు కాంట్రాక్ట్ ఇచ్చారు. అందులో నుంచి ఓ శిలను రామ్ లల్లా విగ్రహానికి శిల్పి అరుణ్ యోగిరాజ్ ఎంచుకున్నారు. అయితే అదే శిల నుంచి సేకరించిన మిగిలిన బ్లాక్ లను భరత, లక్ష్మణ, శత్రుఘ్నుల విగ్రహాలను చెక్కడానికి తీసుకెళ్లారు.