
యూపీలోని మెయిన్ పురి జిల్లాలో ఓ వ్యక్తి తన ఐదుగురు కుటుంబ సభ్యులను చంపి ఆత్మహత్య చేసుకున్న మరుసటి రోజే.. అదే రాష్ట్రంలో అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. 35 ఏళ్ల వ్యాపారవేత్త తన ఐదేళ్ల కుమారుడిని నరికి చంపి, భార్య, కుమార్తెను తీవ్రంగా గాయపరిచి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం ఫరూఖాబాద్ లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.
వ్యాపారంలో ఆర్థిక నష్టాలు రావడంతో ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఫరూఖాబాద్ జిల్లా జహాన్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రతన్ పూర్ గ్రామానికి చెందిన దినేష్ యాదవ్ (35) ఓ వ్యాపారవేత్త. ఆయనకు భార్య మీనా(32), కూతురు అన్షి(11), కుమారుడు ఓశీమ్ల (5) ఉన్నారు. అయితే ఇటీవల ఆయన చేస్తున్న వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీనిని ఆయన తట్టుకోలేకపోయారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో వస్తానో.. లేదో తెలియదు - కార్యకర్తలతో బండి సంజయ్ కుమార్
అందుకే ఆయన ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. అయితే దినేష్ యాదవ్ బలవన్మరణానికి పాల్పడే ముందు ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులపై గొడ్డలితో దాడి చేశాడు. అయితే ఈ ఘటనలో ఓశీమ్ల చనిపోయాడు. భార్య, కూతురు అరుపులు వినపడటంతో స్థానికులు ఇంటికి చేరుకొని తలుపులు పగులగొట్టారు. దీంతో దినేష్ అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం గ్రామ శివారులో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అయితే గాయపడిన తల్లీ కూతుర్లను స్థానికులు రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేర్పించారు. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. కాగా.. కాన్పూర్ లోని ఓ ప్రైవేట్ యానిమల్ ఫీడ్ కంపెనీ తనను వేధిస్తోందని ఆరోపిస్తూ ఫరూఖాబాద్ అధికారులందరినీ ఉద్దేశించి దినేష్ యాదవ్ వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పోస్టు చేసినట్టు ఎస్పీ వికాస్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.