
జాతుల మధ్య వైరం కారణంగా మణిపూర్ రావణ కాష్టంలా రగులుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ , ప్రైవేట్ ఆస్తుల విధ్వంసం, హత్యలు, లూటీలు, మహిళలపై అత్యాచారాలు వంటి ఘటనలతో మణిపూర్ ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఇక్కడ శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్ధితులు చక్కబడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇదిలావుండగా.. దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత తొలిసారిగా మణిపూర్లో ఓ హిందీ చిత్రం ప్రదర్శించబడుతోంది. అది కూడా స్వాతంత్య్ర దినోత్సవం రోజున కావడం విశేషం.
గిరిజన సంస్థ ‘‘ Hmar Students' Association (HSA)’’ మంగళవారం సాయంత్రం చురచంద్పూర్ జిల్లాలోని రెంగ్కాయ్ (లంకా)లో హిందీ చిత్రాన్ని ప్రదర్శించాలని ప్లాన్ చేసింది. అయితే అది ఏ సినిమా అన్నది మాత్రం వివరించలేదు. దశాబ్ధాలుగా ఆదివాసీలను లొంగదీసుకుంటున్న తీవ్రవాద గ్రూపులపైన మన ధిక్కారాన్ని, వ్యతిరేకతను తెలియజేసేందుకే ఇది అని హెచ్ఎస్ఏ ఒక ప్రకటనలో తెలిపింది. స్వేచ్ఛ, న్యాయం కోసం మా పోరాటాన్ని కొనసాగించేందుకు తమతో చేరాలని హెచ్ఎస్ఏ పిలుపునిచ్చింది.
Also Read: స్వార్థ ప్రయోజనాల చర్యల వల్లే మారణహోమం: సీఎం బీరెన్ సింగ్
మణిపూర్లో చివరిసారిగా ప్రదర్శించబడిన హిందీ చిత్రం 1998ల విడుదలైన ‘‘కుచ్ కుచ హోతా హై’’ అని హెచ్ఎస్ఏ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు ఇంఫాల్లో పరిమిత సంఖ్యలో ప్రేక్షకుల కోసం కశ్మీర్ ఫైల్స్, రాకెట్రీలను ప్రదర్శించింది. అయితే స్వాతంత్ర్య దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన ఉగ్రవాద గ్రూపుల నుంచి తాము స్వేచ్ఛను ప్రకటిస్తామన్నారు.
కాగా.. తిరుగుబాటు సంస్థ రెవల్యుషనరీ పీపుల్స్ ఫ్రంట్ (ఆర్పీఎఫ్) 2000 సెప్టెంబర్లో హిందీ చిత్రాల ప్రదర్శనపై నిషేధం విధించింది. ఇది ప్రకటించిన వారంలోనే రాష్ట్రంలోని ఔట్లెట్ల నుంచి సేకరించిన 6000 నుంచి 8000 హిందీ సినిమా ఆడియా క్యాసెట్లు, కాంపాక్ట్ డిస్క్లను తిరుగుబాటుదారులు తగులబెట్టారు. హిందీ సినిమాలపై నిషేధం విధించడానికి ఆర్పీఎఫ్ ఎటువంటి కారణం చెప్పనప్పటికీ, రాష్ట్ర భాష, సంస్కృతిపై బాలీవుడ్ ప్రతికూల ప్రభావం చూపుతుందని తీవ్రవాద సంస్థ భయపడుతున్నట్లు కేబుల్ ఆపరేటర్లు పేర్కొన్నారు.