గుజరాత్ లో ప్రభుత్వాన్ని నడపడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని చెప్పేందుకు రూపానీ రాజీనామానే నిదర్శనమని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్దిక్ పటేల్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రూపానీ రాజీనామా ఓ ప్రయత్నం వంటిదని హర్దిక్ ఎద్దేవా చేశారు.
అనూహ్య పరిణామాల మధ్య గుజరాత్ సీఎం పదవి నుంచి విజయ్ రూపానీ తప్పుకోవడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ స్పందించింది. గుజరాత్ రిమోట్ కంట్రోల్ ఢిల్లీ చేతుల్లో ఉందన్న విషయం ఈ పరిణామంతో స్పష్టమైందని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ హార్దిక్ పటేల్ అన్నారు. గుజరాత్ లో ప్రభుత్వాన్ని నడపడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని చెప్పేందుకు రూపానీ రాజీనామానే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రూపానీ రాజీనామా ఓ ప్రయత్నం వంటిదని హర్దిక్ ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వ చేతకానితనాన్ని దాచిపెడుతున్నారని ఆయన విమర్శించారు.
కరోనా సంక్షోభ సమయంలో రూపానీ సర్కార్ అసమర్థత బయటపడిందని, ఆక్సిజన్ కొరత, శ్మశాన వాటికల వద్ద కనిపించిన ఘోర దృశ్యాలతో గుజరాత్ దుస్థితి యావత్ ప్రపంచం చూసిందని హర్దిక్ గుర్తుచేశారు. మరోవైపు ద్రవ్యోల్బణంతో వ్యాపారులు తీవ్ర నష్టాల పాలయ్యారని, నిరుద్యోగిత పెరిగిందని, పరిశ్రమల మూసివేత కొనసాగుతోందని హార్దిక్ పటేల్ స్పష్టం చేశారు.
Also Read:గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీని తప్పించడం వెనుక బీజేపీ వ్యూహం ఇదేనా?
ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెంతకాలం గుజరాత్ ను ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా పాలిస్తారు? ఇంకెంతకాలం ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుతారు? అని ఆయన ప్రశ్నించారు. 2014 తర్వాత గుజరాత్ లో ఓ సీఎంను మార్చడం ఇదే ప్రథమం అని, కానీ అసలైన మార్పు వచ్చే ఏడాది ఎన్నికల్లో కనిపిస్తుందని హర్దిక్ జోస్యం చెప్పారు. బీజేపీని ప్రజలు కూకటివేళ్లతో పెకలించివేయడం అప్పుడు చూస్తారని ఆయన అన్నారు.