
దేశంలో పెట్రోల్, డీజిల్తో సమానంగా వంట నూనెలు కూడా పెరగడంతో సామాన్యులు అల్లాడుతున్నారు. వీటిని నియంత్రించాలని, ధరలను తగ్గించాలని ప్రతిపక్షాలు రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తున్నాయి. ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లోనూ ఆందోళన నిర్వహించాయి. ఈ నేపథ్యంలో దేశంలో పెరిగిన వంట నూనెల ధరలపై కేంద్రం దృష్టిసారించింది. వీటిని తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు వివిధ రకాల నూనెలపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ముడి పామాయిల్పై ఉన్న 10% దిగుమతి సుంకాన్ని 2.5 శాతానికి, ముడి సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్పై ఉన్న 7.5% సుంకాన్ని 2.5 శాతానికి తగ్గించారు.
ఇక అన్ని రకాల రిఫైన్డ్ ఆయిల్స్పై ఉన్న దిగుమతి సుంకాన్ని 37.75% నుంచి 32.5 శాతానికి కుదించారు. తాజా తగ్గింపు నేపథ్యంలో ముడి నూనెలపై దిగుమతి సుంకంతో కలుపుకొని మొత్తం పన్నులు 24.75 శాతానికి తగ్గనున్నాయి. ఇక రిఫైన్డ్ ఆయిల్స్పై ఉన్న పన్ను 35.75 శాతానికి చేరనున్నాయి. దేశీయ వంటనూనెల అవసరాల్లో భారత్ దాదాపు 60 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఇండోనేసియా, మలేషియా నుంచి పామాయిల్ వస్తుండగా.. అర్జెంటీనా, బ్రెజిల్, ఉక్రెయిన్, రష్యా నుంచి సోయా, సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతోంది.