బిజెపి హేమాహేమీల సొంత రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు(గురువారం) వెలువడనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సొంతరాష్ట్రం గుజరాత్, బిజెపి జాతీయాధ్యక్షడు జేపి నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగా ఇవాళ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. గుజరాత్ లో అధికార బిజెపి, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ప్రధాన పోటీ వుండగా, హిమాచల్ ప్రదేశ్ బిజెపి, కాంగ్రెస్ మధ్య పోటీ వున్నట్లు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసారు. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

04:42 PM (IST) Dec 08
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చతికిలపడింది. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ రఘుశర్మ రాజీనామా చేశారు. హస్తం పార్టీ ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
03:52 PM (IST) Dec 08
గవర్నర్ కు రాజీనామా లేఖను పంపనున్నట్టుగా హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ చెప్పారు. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు.హిమాచల్ ప్రదేశ్ ప్రజల తీర్పును శిరసావహిస్తానని ఆయన చెప్పారు.
03:24 PM (IST) Dec 08
గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా 150కి పైగా స్థానాల్లో గెలుపొందింది. అటు మార్పు తీసుకొస్తామంటూ బరిలోకి దిగిన ఆప్ను గుజరాతీయులు తిరస్కరించారు. ఈ క్రమంలో స్వయంగా ఆ పార్టీ సీఎం అభ్యర్ధి ఇసుదాన్ గఢ్వీ పరాజయం పాలయ్యారు.
02:44 PM (IST) Dec 08
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ.. అక్కడ వరుసగా ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు కూడా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సీఆర్ పాటిల్ తెలిపారు. భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకార కార్యక్రమం డిసెంబర్ 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుందని చెప్పారు.
02:30 PM (IST) Dec 08
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే అధికారం కోసం బీజేపీ వ్యూహాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యేల్ని కాపాడుకునే పనిలో కాంగ్రెస్ పడింది. దీనిలో భాగంగా గెలిచిన ఎమ్మెల్యేలను రాజస్థాన్కు తరలించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఛార్టర్డ్ ఫ్లైట్ రెడీ చేసింది. ఎమ్మెల్యేల తరలింపు బాధ్యత ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ భగేల్కు అప్పగించింది హైకమాండ్.
02:09 PM (IST) Dec 08
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. వరుసగా ఏడో సారి అధికారాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించింది. ఇకపోతే.. గుజరాత్ ఎన్నికల్లో జామ్ నగర్ నార్త్ నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్ధిపై దాదాపు 61 వేలకు పైగా మెజార్టీతో రివాబా గెలుపొందారు.
01:31 PM (IST) Dec 08
గుజరాత్ లో భారీ విజయం దిశగా బిజెపి దూసుకుపోతోంది. ఇప్పటివరకు బిజెపి 157, కాంగ్రెస్ 17, ఆప్ 5, ఇతరులు మూడుచోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.
12:25 PM (IST) Dec 08
గుజరాత్ లో బిజెపి బోణీ కొట్టింది. దాహోద్ అసెంబ్లీ బిజెపి అభ్యర్థి కన్హయ్యలాల్ బాచుబాయ్ కిషోరి 29వేల భారీ ఆధిక్యంతో విజయం సాధించాడు.
11:31 AM (IST) Dec 08
హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా అడుగులు వేస్తోంది. ఆ పార్టీ ఆధిక్యం మ్యాజిక్ ఫిగర్ ను దాడి 38కి చేరుకుంది. బిజెపి కేవలం 27 స్థానాల్లో, ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో వున్నారు.
11:16 AM (IST) Dec 08
హిమాచల్ ప్రదేశ్ లో మొదటి ఫలితం వెలువడింది. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ 20వేల మెజారిటీతో విజయం సాధించారు.
11:05 AM (IST) Dec 08
గుజరాత్ లో అధికార బిజెపి మరోసారి అద్భుత ప్రదర్శన కనబర్చింది. గత ఎన్నికల కంటే బిజెపి ఆరుశాతం ఓట్ షేర్ పెంచుకుని 55శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్ 15 శాతం ఓట్ షేర్ కోల్పోయి 27 శాతానికి పరిమితమయ్యింది.
11:00 AM (IST) Dec 08
హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఆధిక్యం అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు మొత్తం 68 స్థానాల్లో కాంగ్రెస్ 35, బిజెపి 29 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇతరులు నాలుగుచోట్ల ఆధిక్యంలో వున్నారు.
10:08 AM (IST) Dec 08
గుజరాత్ లో బిజెపి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 182 స్థానాల్లో బిజెపి 150 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.
10:03 AM (IST) Dec 08
హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఇప్పటివరకు అందుతున్న వివరాల ప్రకారం కాంగ్రెస్ 34, బిజెపి 31 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
09:40 AM (IST) Dec 08
గుజరాత్ లో బిజెపి ఏడోసారి అధికారాన్ని చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలు జరిగిన 182 స్థానాల్లో బిజెపి 144 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ 25 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. గుజరాత్ పై భారీ ఆశలు పెట్టుకున్న ఆప్ చతికిల పడేలా కనిపిస్తోంది. ఆ పార్టీ కేవలం 8 చోట్ల ఆధిక్యంలో వుంది.
09:35 AM (IST) Dec 08
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘాట్లొడియ నియోజకవర్గంలో ముందంజలో వున్నారు.
09:29 AM (IST) Dec 08
టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జామ్ నగర్ లో ముందంజలో వుంది.
09:20 AM (IST) Dec 08
గుజరాత్ లోని వడ్గాం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసిన జిగ్నేష్ మేవాని వెనుకంజలో వున్నారు.
09:10 AM (IST) Dec 08
హిమాచల్ ప్రదేశ్ లో బిజెపి మంత్రి రాజీవ్ సైజాల్ వెనుకంజలో వున్నారు.
09:03 AM (IST) Dec 08
హిమాచల్ ప్రదేశ్ లో అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. ఇక్కడ బిజెపి 34, కాంగ్రెస్ 32 స్థానాల్లో ఆధిక్యలో కొనసాగుతున్నాయి.
08:58 AM (IST) Dec 08
గుజరాత్ లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన ఇసుధన్ గద్వీ కంబాలియా అసెంబ్లీ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.
08:54 AM (IST) Dec 08
గుజరాత్ లోని విరంగామ్ అసెంబ్లీ స్థానంలో బజెపి అభ్యర్థి హార్దిక్ పటేల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
08:51 AM (IST) Dec 08
హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి సుఖ్వీందర్ సింగ్ సుఖు వెనుకంజలో వున్నాడు.
08:46 AM (IST) Dec 08
గుజరాత్ లో మొత్తం 182 స్థానాల్లో బిజెపి 135, కాంగ్రెస్ 40, ఆప్ ఐదు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో 39, కాంగ్రెస్ 27 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇప్పటివరకయితే ఆప్ పరిస్థితి గుజరాత్ లో దారుణంగా వుంది.
08:30 AM (IST) Dec 08
హిమాచల్ ప్రదేశ్ లో బిజెపి, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ఇక్కడ అధికార బిజెపి 19, కాంగ్రెస్ 12 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
08:22 AM (IST) Dec 08
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఇప్పటివరకు జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బిజెపి దూసుకుపోతోంది. బిజెపి 72, కాంగ్రెస్ 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆప్ కు పోస్టల్ బ్యాలెట్స్ లో తీవ్ర నిరాశ ఎదురయ్యింది.
08:13 AM (IST) Dec 08
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అటు గుజరాత్, ఇటు హిమాచల్ ప్రదేశ్ లోనూ బిజెపి ముందంజలో వుంది. గుజరాత్ లో బిజెపి 24, కాంగ్రెస్ 6, ఆప్ ఒక స్థానంలో ఆధిక్యంలో వున్నాయి. ఇక హిమాచల్ లో బిజెపి 7, కాంగ్రెస్ 23 చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.
08:05 AM (IST) Dec 08
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు అభ్యర్దులతో పాటు కౌంటింగ్ ఏజెంట్స్ చేరుకున్నారు. వారి సమక్షంలోనే అధికారులు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు.
07:40 AM (IST) Dec 08
గుజరాత్ తో రెండు విడతలు, హిమాచల్ ప్రదేశ్ లో ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇరురాష్ట్రాల ఎన్నికలను బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక జాతీయ పార్టీగా ఎదగాలని చూస్తున్న ఆమ్ ఆద్మీ ప్రధాని సొంతరాష్ట్రంలో పాగా వేయాలని, కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోవాలని ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నాయి.
07:19 AM (IST) Dec 08
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభంకాగా 8.30 నుండి ఈవిఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది.