
గోవా లిబరేషన్ డే వేడుకల్లో (goa liberation day) ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) పాల్గొన్నారు. పనాజీలోని ఆజాద్ మైదాన్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. గోవాపై ప్రశంసల వర్షం కురిపించారు. అనతి కాలంలోనే గోవా చాలా దూరం ప్రయాణించిందని.. అభివృద్ధిలో దూసుకెళ్తుందని మోడీ పేర్కొన్నారు. కొన్ని శతాబ్దాల క్రితం దేశంలోని చాలా ప్రాంతాలు మొగలుల పాలనలో ఉండగా, గోవా మాత్రం పోర్చుగల్ పాలనలో (portugal rule) ఉండేదని ప్రధాని గుర్తిచేశారు.
శతాబ్దాలు గడిచినా గోవా తన భారతీయతను మరువలేదని, భారతదేశం కూడా గోవా తమ రాష్ట్రమేనన్న సంగతిని మర్చిపోలేదని మోడీ వ్యాఖ్యానించారు. ఈ రోజు గోవా విముక్తి వజ్రోత్సవాన్ని జరుపుకోవడం మాత్రమే కాదు, 60 సంవత్సరాల ఈ ప్రయాణం, జ్ఞాపకాలు కూడా మన ముందు ఉన్నాయని ప్రధాని మోడీ అన్నారు. లక్షలాది మంది గోవా వాసుల కృషి, పోరాటాలు, త్యాగాల చరిత్ర కూడా మన ముందు ఉందంటూ ప్రధాని పేర్కొన్నారు.
Also Read:Goa Liberation Day: గోవా లిబరేషన్ డే వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ
గోవా ముక్తి విమోచన సమితి సత్యాగ్రహంలో 31 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. సర్దార్ పటేల్ (sardar vallabhbhai patel) ఇంకొన్నాళ్లు జీవించి ఉంటే గోవా విముక్తి కోసం ఇంత కాలం ఎదురుచూడాల్సిన అవసరం ఉండేది కాదంటూ ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా గోవా మాజీ ముఖ్యమంత్రి దివంగత మనోహర్ పారికర్ను (manohar parrikar) మోడీ గుర్తుచేసుకున్నారు. పారికర్ ప్రవర్తన ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు ఎంత నిజాయితీపరులో, ప్రతిభావంతులో దేశం మొత్తం చూసిందని ప్రధాని ప్రశంసించారు.
ఒక వ్యక్తి తన రాష్ట్రం కోసం, ప్రజల కోసం తన ఆఖరి శ్వాస వరకు పోరాడుతాడనే విషయాన్ని మనోహర్ పారికర్ ద్వారా చూశామని కొనియాడారు. గోవాకి అన్ని అంశాల్లో అగ్రస్థానమేనని.. పరిపాలనలో, తలసరి ఆదాయంలో ఇంకా చాలా అంశాల్లో గోవాదే ముందంజ అంటూ ప్రధాన మోడీ ప్రశంసించారు. గోవాలో సింగిల్ డోస్ కరోనా వ్యాక్సినేషన్ పూర్తయిందని నరేంద్ర మోడీ గుర్తుచేశారు.
ఈ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ దాదాపు రూ.600 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటిలో పునరుద్ధరించబడిన ఫోర్ట్ అగ్వాడా ప్రిజన్ మ్యూజియం, గోవా మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్, న్యూ సౌత్ గోవా డిస్ట్రిక్ట్ హాస్పిటల్, మోపా ఎయిర్పోర్ట్లోని ఏవియేషన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మార్గోలోని దావోర్లిమ్-నవేలిమ్లో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ సెంటర్ ఉన్నాయి.