Global Buddhist Summit 2023: యావత్ ప్రపంచ నేడు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, సమస్యలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోవడానికి దేశరాజధానిలో గ్లోబల్ బౌద్ద సమ్మిట్ 2023 జరగనుంది. ఏప్రిల్ 20,21 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే తొలి ప్రపంచ బౌద్ధ మహాసభల్లో సుదూర మెక్సికో, బ్రెజిల్ సహా 30 దేశాలకు చెందిన 180 మంది బౌద్ధ ధర్మ గురువులు, బౌద్ధ పండితులు, ఆలోచనాపరులు, వక్తలు పాలుపంచుకుంటారు. ప్రపంచంలో పెరుగుతున్న తీవ్రవాదం, ఘర్షణాత్మక రాజకీయాలను ఎదుర్కోవడంలో భారతదేశ విధానంలో భాగంగా ఈ సదస్సు జరగనుంది. ప్రపంచంలోని మతాలను ఏకం చేయడం, వాటి నాయకుల నుండి పరిష్కారాలను కోరడం కూడా భారతదేశ విధానంలో భాగంగా ఉంది. భారత్-ఇంనేషియాలో మతాంతర శాంతి-సామాజిక సామరస్య సంస్కృతిని పెంపొందించడంలో ఉలేమాల పాత్ర అనే సదస్సు ఢిల్లీలో జరిగిన రెండు నెలల తరువాత ఈ సమావేశం జరుగుతోంది.
న్యూఢిల్లీకి చెందిన ఇంటర్నేషనల్ బౌద్ధ కాన్ఫెడరేషన్ (ఐబీసీ) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు గ్లోబల్ బౌద్ధ సదస్సు జరుగుతోంది. 'తత్వశాస్త్రం నుంచి ప్రాక్సిస్ వరకు సమకాలీన సవాళ్లకు ప్రతిస్పందనతు' అనేది ఈ సదస్సు థీమ్. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ పండితులు, సంఘ నాయకులు, బౌద్ధ ధర్మ అభ్యాసకులు ప్రపంచ సమస్యలపై చర్చిస్తారు. అలాగే, బౌద్ధం సార్వత్రిక విలువల నుండి పరిష్కారాలను అన్వేషిస్తారు. బౌద్ధమతం, శాంతి, పర్యావరణ సంక్షోభం, ఆరోగ్యం, సుస్థిరత, నలంద బౌద్ధ సంప్రదాయ పరిరక్షణ, అలాగే బౌద్ధ తీర్థయాత్ర, జీవన వారసత్వం, బుద్ధ అవశేషాలు వంటి అంశాలను ఇది కవర్ చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి, వాటికి సమాధానాలు కనుగొనడం ఈ బౌద్ధ సమ్మేళనం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సదస్సు గురించి ఐబీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ధమ్మపియా మాట్లాడుతూ.. బుద్ధుని సూత్రాలను అనుసరించడం ద్వారా సమాంతర ప్రపంచంలోని అనేక సమస్యలను పరిష్కరించవచ్చునని తెలిపారు. విశ్వంలో రెండు విపరీత దృక్పథాల మధ్య సంఘర్షణ ఉందనీ, బుద్ధుని మధ్య మార్గం, సమతుల్యత దాని పరిష్కారానికి కీలకమని ఆయన అన్నారు. "అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య నినాదం నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను, సమస్యలను పరిష్కరించడమే. ఢిల్లీలో జరగబోయే గ్లోబల్ బౌద్ధ సమ్మిట్ భగవాన్ బుద్ధుని సమతుల్య జీవన విధానం బోధన ఆధారంగా జరగనుంది. ఈ సదస్సులో ప్రపంచం నలుమూలల నుంచి బౌద్ధ పండితులు, సంఘ్ సభ్యులు పాల్గొంటారని" దమ్మపియా తెలిపారు.
ఈ సదస్సులో నైతిక, సాంస్కృతిక క్షీణత, మత సంఘర్షణలు, అవినీతి, ఆహార, నీటి భద్రత లేకపోవడం, నిరుద్యోగం, పర్యావరణ క్షీణత, పేదరికం, పోషకాహార లోపం, ప్రపంచవ్యాప్తంగా సమాజాలు ఎదుర్కొంటున్న ఇతర తీవ్రమైన సమస్యలపై సెషన్లు ఉండనున్నాయి. ఐబీసీ డైరెక్టర్ జనరల్ అభిజీత్ హల్దార్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచం యుద్ధం, హింస, ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు వంటి ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. మానవ నిర్మితమైన ఈ సమస్యలను మానవుడు మాత్రమే పరిష్కరించగలడని తెలిపారు. మానవులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుగొనడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ బౌద్ధ ఆలోచనాపరులను ఒకే వేదికపైకి తీసుకురావడమే గ్లోబల్ బౌద్ధ సమ్మిట్ ఉద్దేశమని తెలిపారు.
సాంస్కృతిక సంబంధాలను పునరుద్ధరించడానికి, మధ్య ఆసియాలోని బౌద్ధ కళలు, కళా శైలులు, పురావస్తు ప్రదేశాలు-షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) దేశాలకు చెందిన నిపుణులతో ఐబీసీ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ-విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త బౌద్ధ వారసత్వంపై ప్రపంచ స్థాయి నిపుణుల సమావేశాన్ని నిర్వహించిన తరువాత ఈ సమావేశం జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది.