
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించిన సంచలన విషయాలను ఆ పార్టీ మాజీ నేత, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ వెల్లడించారు. రాహుల్ గాంధీ ‘‘విదేశీ లింకులు’’ కలిగి ఉన్నారని.. వివిధ అంశాలలో దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ స్పెషల్ ఎడిషన్ కోసం ఏషియానెట్ న్యూస్ రెసిడెంట్ ఎడిటర్ ప్రశాంత్ రేగువంశంతో జరిగిన ప్రత్యేక సంభాషణలో గులాం నబీ ఆజాద్ పలు అంశాలను ప్రస్తావించారు. మోదీ-అదానీ మధ్య బంధం ఉందని ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ.. తనపై విమర్శలు చేయడంపై కూడా ఆజాద్ స్పందించారు.
‘‘ఇది సిగ్గుచేటు. రాహుల్ గాంధీ తనకు ఏ వ్యాపారవేత్తతోనూ సంబంధం లేదని అన్నారు. అయితే అతని కుటుంబమంతా వ్యాపారవేత్తలతో అనుబంధం కలిగి ఉంది. ఎందుకంటే (గాంధీ) కుటుంబంపై నాకు ఇప్పటికీ చాలా గౌరవం ఉంది. నేను ఏమీ మాట్లాడకూడదని అకుంటున్నాను. లేకపోతే.. నేను 10 ఉదాహరణలు ఇవ్వగలను; అవాంఛనీయ వ్యాపారవేత్తలను ఆయన ఎక్కడ కలుసుకుంటాడో -- దేశం వెలుపల కూడా --’’ అని ఆజాద్ అన్నారు.
రాహుల్ గాంధీపై మరో మాజీ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా విరుచుకుపడ్డారు. ‘‘దేశానికి వ్యతిరేకంగా పని చేసే ద్రోహి’’ అనే సిద్ధాంతాలు తప్ప పార్టీకి ఇకపై ఎలాంటి సిద్ధాంతాలు లేవని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితిపై ఆజాద్ స్పందిస్తూ.. ‘‘ఇందిరా గాంధీని అనర్హులుగా ప్రకటించి జైలుకు పంపినప్పుడు లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. లక్షల మంది జైలుకు వెళ్లారు. ఇప్పుడు, రాహుల్ గాంధీ, తన భారత్ జోడో యాత్ర ముగిసిన వెంటనే.. ఎంపీగా అనర్హడయ్యారు. ఒక్క దోమ కూడా ఏడవలేదు. ఢిల్లీ నుంచి వర్కింగ్ కమిటీ సభ్యులు, ఎంపీలు, గుజరాత్ ఎమ్మెల్యేలతో కలిసి సూరత్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. గుజరాత్ నుంచి ఒక్క యువకుడు లేదా రైతు కూడా రాహుల్తో చేరలేదు’’ అని అన్నారు.
రాహుల్ను చుట్టుపక్కల వారు తప్పుదారి పట్టిస్తున్నారా అని ఆజాద్ను ప్రశ్నించగా.. “రాహుల్ గాంధీ తనను తానే తప్పుదారి పట్టించుకుంటాడు. అతనికి అతనే ఎలాంటి దిశ లేని వ్యక్తి. మేము 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం.. మేము ఎందుకు తప్పుదారి పట్టలేదు. అతని దాడీ (నాయనమ్మ) ఎందుకు తప్పుదారి పట్టలేదు? సోనియా గాంధీ ఎందుకు తప్పుదారి పట్టలేదు? రాజీవ్ గాంధీ ఎందుకు తప్పుదారి పట్టలేదు?’’ అని అన్నారు.
కాంగ్రెస్లో పరిస్థితులపై తనలాంటి వృద్ధుల కంటే ఆ పార్టీలోని యువ తరం నాయకులు 10 రెట్లు ఎక్కువ నిరాశ చెందడం దురదృష్టకరమని అన్నారు. అందుకే చాలా మంది యువ నాయకులు కాంగ్రెస్ను వీడారని చెప్పుకొచ్చారు. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ గ్రాండ్ ఓల్డ్ పార్టీని వీడి బీజేపీలో చేరిన నేపథ్యంలో ఆజాద్ ఈ వ్యాఖ్యలు చేశారు.