
ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ గ్యాంగ్ స్టర్ ను పలువురు నేరగాళ్లు కాల్చి చంపారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. ఆ నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడే ఈ కాల్పులు జరగడం గమనార్హం. పోలీసుల కళ్లలో కారం కొట్టి మరీ దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. రన్ వేపై దొర్లుతూ వెళ్లడంతో.. వీడియో వైరల్
‘ఇండియా టుడే’కథనం ప్రకారం.. రాజస్థాన్ కు చెందిన కుల్దీప్ జగినా ఓ గ్యాంగ్ స్టర్. అతడిని ఓ హత్య కేసులో కొంత కాలం కిందట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ప్రస్తుతం జైపూర్ జైలులో ఖైదీగా ఉన్నాడు. కాగా.. అతడిని పోలీసులు బుధవారం భరత్ పూర్ కోర్టుకు తీసుకెళ్లాల్సి వచ్చింది.
దీని కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఆ గ్యాంగ్ స్టర్ ను పోలీసులు ఓ వాహనంలో ఎక్కించుకొని భరత్ పూర్ కోర్టుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఆ వాహనం జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై అమోలి టోల్ ప్లాజా వద్దకు చేరుకుంది. దీనినే అదనుగా చేసుకున్న పలువురు దుండగులు వెంటనే అక్కడికి చేరుకొని పోలీసుల కళ్లలో కారం పొడి చల్లారు.
ఒక్క సారిగా జరిగిన ఈ పరిణామంతో పోలీసులు ఏమీ అర్థం కాలేదు. వారు కళ్ల మంటలతో అల్లాడుతున్న సమయాన్ని ఆసరాగా చేసుకున్న ఆ దుండగులు గ్యాంగ్ స్టర్ కుల్దీప్ జగినాను కాల్చి చంపారు. ఈ ఘటన జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.