Lucknow: ఉత్తరప్రదేశ్ లోని గోమతి నగర్ పోలీస్ సర్కిల్లోని దేవాలయం-ఆశ్రమంలో 52 ఏళ్ల మహిళపై మత గురువు శిష్యులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అంతకుముందు, రాష్ట్ర రాజధానిలో 18 ఏళ్ల యువతిపై ఆటో డ్రైవర్, అతని స్నేహితులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Uttar Pradesh: దేశంలో మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా వారి పై దాడులు, అఘాయిత్యాలు, హింస కొనసాగుతూనే ఉంది. నిత్యం ఏదో ఒకచోట మహిళపై దారుణాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో మహిళలపై వరుస దారుణాలు వెలుగుచూస్తుండటంపై ఆందోళన కలిగిస్తోంది. 24 గంటలు గడవకముందే మరో మహిళపై సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్ లో ఒక మహిళ సామూహిక అత్యాచారానికి గురైన ఘటన వెలుగుచూసింది. లక్నోలో 24 గంటల్లో రెండవ సంఘటన నమోదైంది. గోమతి నగర్ పోలీస్ సర్కిల్లోని దేవాలయం-ఆశ్రమంలో 52 ఏళ్ల మహిళపై అక్కడి మత గురువు శిష్యులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెను వైద్య పరీక్షలకు పంపి నలుగురిపై కేసు నమోదు చేశారు. అయితే, తనకు జరిగిన ఘటన గురించి ఆశ్రమ అధిపతితో పాటు పలువురు బెదిరించారు. ఈ విషయం ఎవరికైన చెబితే ప్రాణాలు తీస్తామన్నారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఈ ఘటన చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తనపై జరిగిన అఘాయిత్యం గురించి బాధితురాలు మాట్లాడుతూ.."ఆశ్రమ అధిపతి తనకు సహాయం అందించలేదు" అని తెలిపారు. అలాగే, పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ధైర్యం చేస్తే ప్రాణాలతో వుండవని బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది. అక్టోబరు 4న సాయంత్రం ఈ ఘటన జరిగిందని.. గత నెలలో ఆమె ఆశ్రమానికి వచ్చిందని ఫిర్యాదుదారు తెలిపారు. పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఈ ఏడాది ప్రారంభంలో ప్రయాగ్రాజ్లో జరిగిన మాఘమేళా సందర్భంగా ఆమె పరిచయమైన ఒక సన్యాసిని ద్వారా ఆ మహిళ ఆశ్రమానికి చేరుకుంది.
“ఇంతకుముందు నేను మధురలోని ఒక ఆశ్రమంలో ఉండేదానిని. ఈ మహిళ లక్నోలోని ఆశ్రమంలో ఉంటోంది. ఆమె గురువు నిర్వహించే ఆశ్రమంలో నన్ను ఉండమని సిఫారసు చేసింది. నేను గత నెలలో లక్నో ఆశ్రమానికి మారి అక్కడ నివసించడం ప్రారంభించాను. అయితే, కొంతకాలం తర్వాత, ఆ మహిళ తన సోదరుడు బాగా లేకపోవడంతో వారణాసికి వెళ్లిపోయింది. దీంతో నేను ఆశ్రమంలో ఒంటరిగా ఉన్నాను”అని బాధితురాలు చెప్పింది. అయితే, ఒక రోజు సాయంత్రం మత్తుమందులు కలిపిన ఆహారం అందించారు. తాను స్పృహతప్పి పడిపోయిన తర్వాత.. తనపై లైంగికదాడికి పాల్పడ్డారని బాధితురాలు తెలిపింది.
“నేను మేల్కొన్నప్పుడు, నేను పూర్తిగా నగ్నంగా ఉన్నాను. నా శరీరం వణుకుతోంది. నలుగురూ నాపై సామూహిక అత్యాచారం చేశారు. నేను ఆశ్రమ అధిపతికి ఫిర్యాదు చేసినప్పుడు, నేను జీవించాలనుకుంటే దీని గురించి ఎవరికీ చెప్పకుండా సైలెంట్ గా ఉండమంటూ బెదిరించాడు”అని ఆమె పేర్కొంది. ఈస్ట్ జోన్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (DCP), ప్రాచీ సింగ్ మాట్లాడుతూ.. విచారణలో ఆశ్రమ ఆస్తికి సంబంధించిన కొన్ని వివాదాలకు సంబంధించిన కోర్టు కేసు గురించి పోలీసులకు తెలిసిందని చెప్పారు. ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని డీసీపీ తెలిపారు. అంతకుముందు, రాష్ట్ర రాజధానిలో 18 ఏళ్ల యువతిపై ఆటో డ్రైవర్, అతని స్నేహితులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.