చిరుతను కాపాడేందుకు ఫారెస్ట్ అధికారి సాహసం: నెటిజన్ల ప్రశంసలు, చివరికిలా..

By narsimha lodeFirst Published Jul 20, 2020, 10:20 PM IST
Highlights

చిరుతపులి కోసం 100 అడుగుల లోతులో బావిలో చిరుత కోసం వెళ్లిన ఓ అటవీ శాఖ అధికారికి చివరకు నిరాశే కలిగింది. చిరుతను రక్షించేందుకు ధైర్యంగా ఒక్కడే బావిలోకి దిగిన అటవీశాఖాధికారిని పలువురు అభినందించారు.


బెంగుళూరు: చిరుతపులి కోసం 100 అడుగుల లోతులో బావిలో చిరుత కోసం వెళ్లిన ఓ అటవీ శాఖ అధికారికి చివరకు నిరాశే కలిగింది. చిరుతను రక్షించేందుకు ధైర్యంగా ఒక్కడే బావిలోకి దిగిన అటవీశాఖాధికారిని పలువురు అభినందించారు.

కర్ణాటక రాష్ట్రంలోని హెచ్‌డీ కోటే ప్రాంతంలోని ఓ బావిలో చిరుత పులి పడిపోయిందని అటవీ అధికారులకు సమాచారం అందింది. దాంతో మైసూరు అటవీశాఖ బృందం రంగంలోకి దిగింది. చిరుతను రక్షించేందుకు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ సిద్ధరాజు బావిలోకి దిగేందుకు సమయాత్తమయ్యారు.

నీరు లేని బావిలో పడిన చిరుతను రక్షించేందుకు ఆయన 100 అడుగుల లోతులోకి వెళ్లారు. టార్చ్‌లైట్‌, మొబైల్‌ ఫోన్‌ పట్టుకుని సిద్ధరాజు బోనులో కూర్చోగా స్థానికులు, అటవీ శాఖ సిబ్బంది దానిని నెమ్మదిగా బావిలోకి దింపారు.

బావిలోకి దిగిన అటవీశాఖాధికారికి నిరాశే మిగిలింది.  బావిలో చిరుత లేదని ఆయన గుర్తించాడు. బావిలో చిరుత పడిందని స్థానికులు పొరపాటుగా భావించడంతో అటవీ అధికారుల శ్రమ వృధా అయింది. సిద్దరాజు ధైర్యాన్ని ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీణ్‌ కాశ్వాన్‌ ఈ ఫొటోలను ట్విటర్లో షేర్‌ చేశారు.

 సిద్ధరాజు ధైర్యసాహసాలపై ప్రశంసలు కురింపించారు. విధినిర్వహణలో గ్రీన్‌ సోల్జర్స్‌ అంకితభావం పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు. చిరుత కోసం రిస్కు చేసిన సిద్ధరాజు రియల్‌ హీరో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

click me!