కూతురిని చంపడానికి రూ. 1 లక్ష సుపారీ.. లవర్‌ను విడిచిపెట్టట్లేదని నిర్ణయం

By Mahesh KFirst Published Aug 7, 2022, 11:08 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో ఓ తండ్రి కన్న కూతురినే చంపాలని పథకం వేశాడు. హాస్పిటల్ వార్డు బాయ్‌తో కలిసి చంపేయాలని కుట్ర చేశాడు. అందుకు రూ. 1 లక్ష సుపారీ ఇచ్చాడు. పొటాషియం క్లోరైడ్ హై డోసు సూది ఇచ్చి ఆమెను చంపేయాలని అనుకున్నారు. 
 

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న తండ్రే కూతురిని హతమార్చాలని పథకం వేశాడు. తన కూతురు ప్రేమించిన కుర్రాడిని విడిచిపెట్టట్లేదని, వద్దని విజ్ఞప్తి చేసినా ఖాతరు చేయడం లేదని ఆ తండ్రి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. కన్న బిడ్డనే చంపేయాలని ఓ హాస్పిటల్ వార్డ్ బాయ్‌తో కలిసి కుట్ర చేశాడు.

తన కూతురిని చంపేస్తే రూ. 1 లక్ష ఇస్తానని వార్ద్ బాయ్‌కు ఆ తండ్రి నవీన్ కుమార్ ఆఫర్ చేశాడు. వార్డ్ బాయ్ అందుకు అంగీకరించాడు. ఆ తండ్రి తన బిడ్డను హాస్పిటల్ తీసుకెళ్లగా.. ఆ వార్డ్ బాయ్ పొటాషియం క్లోరైడ్ హై డోసు ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో ఆమె ఆరోగ్యం దారుణం దిగజారిపోయింది.

శుక్రవారం రాత్రి ఆమెను కాంకర్ఖేడలోని హాస్పిటల్‌కు తన బిడ్డను తీసుకెళ్లాడు. కానీ, అనంతరం కొన్ని గంటలకే మోదిపురంలోని ఫ్యూచర్ ప్లస్ హాస్పిటల్‌కు తరలించాడు. అదే రాత్రి ఆమె ఆరోగ్యం అనూహ్యంగా దిగజారిపోయింది. 

వైద్యులు ఈ విషయాన్ని పరీక్షించగా ఆమెకు పొటాషియం క్లోరైడ్ హై డోసు ఇచ్చినట్టు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. ఆ అమ్మాయికి ఇంజెక్షన్ ఇచ్చిన వ్యక్తి నరేష్ కుమార్ అని పోలీసులు గుర్తించారు. 

ఆ అమ్మాయిని చంపితే తండ్రి నవీన్ కుమార్ తనకు రూ. 1 లక్ష ఇస్తానని ఆఫర్ చేశాడని నరేష్ కుమార్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఓ మహిళా ఉద్యోగితో కలిసి ఆయన డాక్టర్‌గా నటిస్తూ వార్డులోకి ఎంటర్ అయ్యాడు. ఇంజెక్షన్ ఇచ్చాడు. ఈ సమాచారంతో పోలీసులు ఆ అమ్మాయి తండ్రి, మహిళా ఉద్యోగిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు. ఆ ముగ్గురినీ అరెస్టు చేశారు. 

పోలీసుల విచారణలో నవీన్ కుమార్ ఈ నేరాన్ని అంగీకరించాడు. తన కూతురు ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నదని చెప్పాడు. ఆ ప్రేమను పక్కనపెట్టాలని, ఆ యువకుడితో రిలేషన్‌షిప్‌లో ఉండొద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా.. వేడుకున్నా తన కూతురు పట్టించుకోలేదని వివరించాడు. 

పోలీసులు వార్డ్ బాయ్ నరేష్ కుమార్ నుంచి రూ. 90 వేలు రికవరీ చేసుకున్నారు.

click me!