ఓటు చోరీ వివాదం: తప్పుడు ఆరోపణలుగా పేర్కొన్న ఎన్నికల సంఘం.. మళ్లీ ఫైర్ అయిన రాహుల్ గాంధీ

Published : Aug 17, 2025, 10:26 PM IST
EC logo and Rahul Gandhi

సారాంశం

Election Commission and Rahul Gandhi Clash: బిహార్ ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల సంఘం-రాహుల్ గాంధీ మధ్య వాగ్వాదం చెలరేగింది. పారదర్శకతపై అనుమానాలు, ఆరోపణల మధ్య సీఈసీ జ్ఞానేశ్ కుమార్ స్పందిస్తూ తప్పుడు ఆరోపణలుగా పేర్కొన్నారు. 

DID YOU KNOW ?
భారత ఎన్నికల సంఘం
భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పడింది. ఈ రోజును జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది ఆర్టికల్ 324 ప్రకారం శాశ్వత సంస్థ.

Election Commission and Rahul Gandhi Clash: భారత రాజకీయాల్లో ఎన్నికల ప్రక్రియ పై కొన్ని సంవత్సరాలుగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బిహార్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR)పై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission), కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఓటర్ల పేర్ల తొలగింపు, ఓటు చోరీ, ద్వంద్వ ఓటింగ్‌ వంటి ఆరోపణలు విసురుతున్న ప్రతిపక్షాలపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC) జ్ఞానేశ్‌ కుమార్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, "ఓటు చోరీ" పేరుతో జరుగుతున్న ప్రచారం తప్పుడు సమాచారమేనని ఖండించారు. “18 ఏళ్లు పూర్తైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంది. ఎన్నికల సంఘానికి అధికార పార్టీ-ప్రతిపక్షం అనే తేడా లేదు. అందరినీ సమానంగా చూస్తాం” అని ఆయన అన్నారు. అలాగే, "రాజ్యాంగ సంస్థలను అనవసరంగా రాజకీయ వేదికగా లాగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు" అని ఆయన పేర్కొన్నారు.

తప్పుడు ఆరోపణలు: సీఈసీ జ్ఞానేశ్ కుమార్

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఎటువంటి పక్షపాతం చూపదని, అన్ని పార్టీలను సమానంగా చూస్తుందని స్పష్టం చేశారు. బీహార్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు.

ఓటరు జాబితా బూత్ స్థాయిలోనే ప్రతి పార్టీకి అందుబాటులో ఉంటుంది. బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లు పారదర్శకంగా ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఆధారాలు లేకుండా ఎవరి పేర్లనూ తొలగించం: సీఈసీ జ్ఞానేశ్ కుమార్

 

బీహార్ ఓటర్ల జాబితా వివాదం ఏమిటి?

ప్రస్తుతం బీహార్‌లో ఓటర్ల జాబితా ముసాయిదా విడుదలైంది. దీనిపై పలు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, జేడీయూ, ఆర్జేడీలు “లక్షలాది ఓటర్ల పేర్లు తొలగించారు” అంటూ ఆరోపణలు చేశాయి. దీనిని ఎన్నికల సంఘం ఖండిస్తూ, ఇది సహజ సవరణ ప్రక్రియలో భాగమని తెలిపింది.

“ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10 సార్లకు పైగా ఈ రకమైన సవరణలు చేపట్టాం. ఎన్నికల ముందు ఓటర్ల జాబితా పక్కాగా ఉండేలా ఇది తప్పనిసరి” అని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు.

మరోసారి ఈసీపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు

కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికల సంఘం వైఖరిని హాస్యాస్పదంగా అభివర్ణించింది. పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ మాట్లాడుతూ.. “రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం సరైన సమాధానాలు ఇవ్వలేకపోయింది. ఇది పక్షపాతానికి నిదర్శనం” అని విమర్శించారు.

రాహుల్ గాంధీ కూడా తన వ్యాఖ్యల్లో ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. “2023లో ప్రభుత్వం ఒక చట్టాన్ని మార్చి, ఎన్నికల సంఘంపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాన్ని తొలగించింది. ఇది బీజేపీకి ఓట్లు దొంగిలించడానికి మార్గం సుగమం చేసింది” అని ఆయన అన్నారు.

ఈసీ పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు

రాహుల్ గాంధీ ప్రకారం.. బీహార్‌లో దాదాపు 65 లక్షల ఓటర్ల పేర్లు తొలగించారు. ఇది పేదల గొంతును అణచివేయడానికి, పెద్ద వ్యాపారవేత్తల ప్రయోజనాలకు అనుకూలంగా జరిగిందని ఆయన ఆరోపించారు.

“పేదల చేతిలో మిగిలింది ఓటు ఒక్కటే. దానిని కూడా తీసివేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది పైస్థాయి ఆదేశాలతో జరుగుతోంది” అని రాహుల్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీ ఏర్పాటు చేయడాన్ని నిరాకరించిందని, ఎలక్ట్రానిక్ ఓటర్ల జాబితాకు ప్రాప్యత ఇవ్వకపోవడం అనుమానాలు పెంచుతోందని ఆయన అన్నారు.

రాహుల్ ఆరోపణలపై ఎన్నికల సంఘం ఏం చెప్పింది?

ఈ ఆరోపణలన్నింటికి ఎన్నికల సంఘం సమాధానం ఇస్తూ, “ఓటు చోరీ అనే మాటకు తావే లేదు. కోటి మందికిపైగా అధికారులు ఎన్నికల విధుల్లో పనిచేస్తున్నారు. ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్న ప్రక్రియలో ఓట్ల దొంగతనాలు సాధ్యమే కాదు” అని స్పష్టం చేసింది.

రాజకీయ పార్టీలు నిజాయితీగా అభ్యంతరాలు పెట్టాలంటే నిర్దిష్టమైన ఆధారాలు చూపాలని సీఈసీ పిలుపునిచ్చారు. ఓటరు జాబితాలో లోపాలు ఉంటే సెప్టెంబర్ 1లోపు అన్ని పార్టీలు తమ అభ్యంతరాలను తెలపాలని ఆయన స్పష్టంచేశారు.

బీహార్ ఓటర్ల జాబితా వివాదం ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై మళ్లీ చర్చలు మొదలుపెట్టింది. ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, ఎన్నికల సంఘం మాత్రం పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని చెబుతోంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందనే  ఆసక్తి పెరిగింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !