
హర్యానాలోని నుహ్ లో మతఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో రేవారీ, మహేంద్రగఢ్, ఝజ్జర్ జిల్లాల్లోని 50కి పైగా పంచాయతీలు ముస్లిం వ్యాపారుల ప్రవేశాన్ని నిషేధించాలని లేఖలు జారీ చేశాయి. హరియాణాలోని నుహ్ లో చెలరేగిన మతఘర్షణల తర్వాత పరిస్థితి క్రమంగా సద్దుమణిగినా.. పంచాయతీలు ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాయి.
మణిపూర్ లో భరతమాతను చంపేశారు - లోక్ సభలో ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. ఈ లేఖలపై మూడు జిల్లాల పరిధిలోని 50 పంచాయతీల సర్పంచ్ లు సంతకాలు చేశారు. అందులో ప్రస్తుతం గ్రామాల్లో నివసిస్తున్న ముస్లింలు తమ గుర్తింపునకు సంబంధించిన పత్రాలను పోలీసులకు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం పంచాయతీలకు లేదని లేఖల్లో పేర్కొన్నారు. కాగా.. ఈ 50 ఊర్లలో మైనారిటీ వర్గానికి చెందిన వారెవరూ లేరని సమాచారం. అయితే కొన్ని గ్రామాల్లోని కుటుంబాలు మాత్రం మూడు నాలుగు తరాలుగా ఆ గ్రామాల్లో నివసిస్తున్నాయి.
2019లోనే షిండేను సీఎం చేయాలని శివసేన అనుకుంది.. కానీ - సంజయ్ రౌత్
ఇటీవల నుహ్ లో హిందువులపై జరిగిన దాడులను పరిగణనలోకి తీసుకుని తమ గ్రామాల్లో ముస్లిం వ్యక్తులు ఎలాంటి వ్యాపారాలు చేయకూడదని నిర్ణయించాయని పేర్కొంటూ నార్నౌల్ (మహేంద్రగఢ్) సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ మనోజ్ కు పంపినట్టు ఈ లేఖలు విడుదల అయ్యాయి. అందులో ముస్లింలు పగటిపూట తమ వ్యాపారాలు చేస్తూ, రాత్రివేళ దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నుహ్ హింస వంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. సామాజిక సామరస్యాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎవరి మత మనోభావాలను కించపరచకూడదని తెలిపారు. కాగా ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీనిపై సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ..‘‘ ఈ లేఖలు తమ చేతికి అందలేదు. కానీ వాటిని సోషల్ మీడియాలో చూశాము. ఈ లేఖలు జారీ చేసిన అన్ని పంచాయతీలకు షోకాజ్ నోటీసులు పంపాలని అధికారులను ఆదేశించాం’’ అని అన్నారు. ఇలాంటి లేఖలు ఇవ్వడం చట్ట విరుద్ధమని ఆయన తెలిపారు. ఈ గ్రామాల్లో రెండు శాతం కూడా మైనారిటీ వర్గం లేదని, అందరూ సామరస్యంగా జీవిస్తారని తెలిపారు. ఇలాంటి నోటీసు వల్ల వారు ఇంతకు ముందులా జీవించలేరని అన్నారు.
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు ప్రధాని అయ్యే అవకాశం రాలేదు.. ఎందుకంటే..- ప్రధాని మోడీ
ఇదిలా ఉండగా.. జూలై 31న హర్యానాలోని నుహ్ లో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) ఊరేగింపును కొన్ని గ్రూపులు అడ్డుకున్నాయి. దీంతో హింస చెలరేగింది. ఈ హింసాకాండలో ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్లలో ప్రమేయం ఉందని భావిస్తున్న 300 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 142 ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశారు.