
శివసేనలో ఏక్ నాథ్ షిండే రాజకీయ తిరుగుబాటు ఒక్క సారిగా వెలుగులోకి వచ్చి పార్టీ చీలికకు దారి తీసింది. చివరికి అది ఎంవీఏ ప్రభుత్వం కూలిపోవడానికి కారణం అయ్యింది. ఇప్పుడు శరద్ పవార్ కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో కూడా అసమ్మతి నెలకొందని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ‘టైమ్స్ నౌ (Times now)’ కథనం పేర్కొంది. ఆదివారం మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ ఎన్నిక సమయంలో ఇది బహిర్గతం అయ్యిందని తెలిపింది.
కుక్క మొరిగిందని.. శునకంతో పాటు మరో ముగ్గురిపై ఇనుపరాడ్ తో దాడి..
మొత్తం 288 మంది సభ్యుల సభలో పోలైన 271 ఓట్లలో బీజేపీ నుంచి పోటీలో స్పీకర్ పోటీలో నిలిచిన రాహుల్ నార్వేకర్ కు 164 ఓట్లు రాగా.. ఎంవీఏ అభ్యర్థి రాజన్ సాల్వికి 107 ఓట్లు వచ్చాయి. సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఇద్దరు, ఏఐఎంఐఎంకు చెందిన ఒకరు మొత్తంగా ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఇద్దరు ఎన్సీపీ శాసనసభ్యులు అనిల్ దేశ్ముఖ్, నవాబ్ మాలిక్ వేర్వేరు మనీలాండరింగ్ కేసుల్లో జైలులోనే ఉండిపోయారు. శివసేన ఎమ్మెల్యే ఒకరు ఇటీవల మరణించగా, మిగిలిన వారు అనారోగ్యంతో సహా వివిధ కారణాల వల్ల గైర్హాజరయ్యారు.
అయితే ఐదుగురు ఎన్సీపీ ఎమ్మెల్యేలు దత్తాత్రేయ్ భరణే, అన్నా బన్సోడే, నీలేష్ లంకే, దిలీప్ మోహితే, బాబన్ షిండే కూడా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యారు. ఎన్సీపీ శాసనసభ్యుడు నరహరి జిర్వాల్ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నందున ఓటు వేయలేకపోయారు. గైర్హాజరైన ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో అత్యధికులు మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కు సన్నిహితులుగా భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తన తల్లి మరణం కారణంగా భరణే స్పీకర్ ఎన్నికలకు హాజరు కాలేదని ఎన్సీపీ నేత ఒకరు వార్తా సంస్థ పీటీఐ తెలిపారు. బాబన్ షిండే ప్రస్తుతం వ్యక్తిగత పర్యటనలో దేశం వెలుపల ఉన్నారని, మోహితే, బన్సోడే ఆలస్యంగా విధాన భవన్ కు చేరుకున్న తరువాత పాల్గొనలేకపోయారని నివేదికలు సూచిస్తున్నాయి.
హిందూస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఏక్ నాథ్ షిండే పార్టీ ఫిరాయించి, ఆ తర్వాత శివసేనలో చీలికకు దారితీసే ముందు ఎన్సీపీలోని ఓ వర్గం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని భావించింది. అయితే ఈ సూచనను ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పార్టీ ఎంపీ సుప్రియా సూలే అంగీకరించలేదు. దీంతో పార్టీ శ్రేణులలో అసమ్మతి ఏర్పడింది. అజిత్ పవార్ కు సన్నిహితుడిగా పేరుగాంచిన ఎన్సీపీ సీనియర్ నేత ధనంజయ్ ముండే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటలకే ఆయనతో భేటీ అయ్యారు. ముంబైలోని ఫడ్నవీస్ నివాసంలో గురువారం అర్థరాత్రి ఈ సమావేశం జరిగిందని, సుమారు అరగంట పాటు చర్చ జరిగిందని పీటీఐ నివేదించింది. ఆయనకు గతం నుంచే ఫడ్నవీస్ తో మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే.
కాగా స్పీకర్ ఎన్నిక అనంతరం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ విశ్వాస పరీక్షపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవిపై కూడా పార్టీ ఈ సమావేశంలో దృష్టి సారించింది. ప్రతిపక్ష నాయకుడిగా ఎవరుంటే బాగుంటుందని ఇందులో చర్చించారు.