బెంగళూరులో డెల్టా సబ్ వేరియంట్ కేసులు.. కొత్తరకం కరోనాపై రాష్ట్రంలో ఆందోళనలు

By telugu teamFirst Published Oct 27, 2021, 5:40 PM IST
Highlights

కరోనా వైరస్ కొత్త కొత్త వేరియంట్‌లతో భయపెడుతున్నది. యూకేను కుదిపేస్తున్న డెల్టా సబ్ వేరియంట్ కేసులు ఇప్పుడు మనదేశంలోనూ పెరుగుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటకలో వెలుగు చూశాయి. కర్ణాటకలో ఒక్క బెంగళూరు నగరంలోనే తాజాగా మూడు ఈ డెల్టా సబ్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
 

బెంగళూరు: కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే అంతమయ్యేలా కనిపించడం లేదు. సరికొత్త ఉత్పరివర్తనాలతో Coronavirus కొత్త రూపాన్ని ప్రదర్శిస్తూ భయకంపితులను చేస్తున్నది. కరోనా మహమ్మారి ఇప్పుడు డెల్టా వేరియంట్ రూపంలో వణికిస్తున్నది. అత్యంత వేగంగా వ్యాపిస్తున్నదని చెబుతున్న డెల్టా సబ్ వేరియంట్(ఏవై.4.2) ఇప్పుడు కర్ణాటకలో కలకలం సృష్టిస్తున్నది. తాజాగా ఒకే రోజు Bengaluruలో మూడు ఈ రకం కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే Karnatakaలో వేర్వేరు ప్రాంతాల్లో నాలుగు కేసులు రిపోర్ట్ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఈ కొత్త Delta Subvariantపై ఆందోళనలు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డీ రందీప్ తాజాగా విలేకరులతో ఈ విషయంపై మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు డెల్టా AY.4.2 వేరియంట్ కేసులున్నాయని వెల్లడించారు. ఇందులో మూడు కేవలం బెంగళూరు నగరంలోనే ఉన్నాయని తెలిపారు. మిగతా నాలుగు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నదని, ఇప్పటికీ కట్టడి చర్యలు తీసుకుంటున్నదని వివరించారు.

Also Read: అలర్ట్: భారత్‌లోనూ AY.4.2 వేరియంట్ జాడలు ... మధ్యప్రదేశ్‌లో ఆరుగురిలో గుర్తింపు

విదేశాల నుంచి నేరుగా రాష్ట్రానికి వచ్చేవారికి 72 గంటల ముందు తప్పనిసరి కరోనా నెగెటివ్ రిపోర్టు సమర్పించాలనే నిబంధన అమలు చేస్తున్నట్టు వివరించారు. అయితే, రాష్ట్రంలో అడుగుపెట్టిన తర్వాత వారికి ఎలాంటి క్వారంటైన్ అమలు చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ నెగెటివ్ రిపోర్టులను ఎయిర్ సువధి పోర్ట‌లో అప్‌లోడ్ చేయిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే ఈ సూపర్ స్ప్రెడర్ కరోనా వేరియంట్ వైరస్‌ను అడ్డుకోవడానికి కట్టడి చర్యలు అమలు చేస్తామని వివరించారు. ఇప్పటి వరకు ఈ వేరియంట్ సోకి మరణించినవారైతే రాష్ట్రంలో లేరని తెలిపారు. అయితే, ఇద్దరు పేషెంట్లు ఈ వేరియంట్‌తో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారని తెలిపారు.

యూకేలో గుర్తించిన ఈ కరోనావైరస్ డెల్టా సబ్ వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వమూ స్పందించింది. ఈ సబ్ వేరియంట్‌‌ను కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ పరిశీలిస్తున్నదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా వివరించారు. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వమూ అప్రమత్తమయింది.  యూకేలో ఈ వేరియంట్ విజృంభిస్తున్నదని న్యూక్యాజిల్‌లోని నార్తంబ్రియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త వివరించారు. గత కొన్ని నెలలుగా దేశంలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. గత 28 రోజుల్లో నమోదైన కొత్త కేసుల్లో 63శాతం ఈ సబ్ వేరియంట్ కేసులే ఉన్నాయని చెప్పారు. అయితే, ఈ వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళనకారక వేరియంట్‌గా గుర్తించలేదు.

Also Read: చైనాలో మళ్లీ పెరుగుతున్న కేసులు.. డెల్టా వేరియంట్ విజృంభణ.. మరో ముప్పు తప్పదా?

యూకే సహా చైనాలోనూ డెల్టా వేరియంట్ కలకలం రేపుతున్నది. చైనాలో డెల్టా కేసుల సంఖ్య స్వల్పంగా ఉన్నప్పటికీ వేర్వేరు ప్రదేశాల్లో అంటే 11 ప్రావిన్స్‌లలో ఈ కేసులు రిపోర్ట్ అయ్యాయి. మరీ ఆందోళనకర విషయమేమంటే.. కొన్ని టూరిస్టు గ్రూపుల్లో కరోనా వైరస్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. దీంతో ఈ కేసులు విస్తారంగా నమోదయ్యే ముప్పు ఉన్నదని స్థానిక అధికారులు హెచ్చరిస్తున్నారు. డెల్టా వేరియంట్ కేసులు నమోదవడంపై కలవరపడుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నది.

click me!