పరుగులు పెడుతున్న ఇంధన ధరలు.. అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 120 దాటేసింది..

By team teluguFirst Published Oct 27, 2021, 5:21 PM IST
Highlights

గత కొంతకాలంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో పెరుగుతున్న ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దేశంలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 110 దాటిన సంగతి తెలిసిందే. 

గత కొంతకాలంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో పెరుగుతున్న ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దేశంలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర (Petrol price) రూ. 110 దాటిన సంగతి తెలిసిందే. అయితే మధ్యప్రదేశ్‌లో ఓ జిల్లాలో మాత్రం లీటర్ పెట్రోల్ ధర రూ. 120 దాటింది. ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 120.4 రూపాయలకు చేరింది. వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు జిల్లా అనుప్పూర్‌లో పెట్రోల్ ధర రూ. 120 దాటింది. అదే లీటర్ డీజిల్ ధర.. రూ. 109.17కి చేరింది.  

జిల్లాలోని బిజూరి పట్టణంలోని పెట్రోల్ పంపు యజమాని అభిషేక్ జైస్వాల్ పీటీఐతో మాట్లాడుతూ.. ‘జిల్లా కేంద్రానికి 250 కి.మీ దూరంలో ఉన్న జబల్‌పూర్ ఆయిల్ డిపో నుంచి Anuppurకు పెట్రోలియం తీసుకువస్తారు. అందువల్ల రవాణా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే అనుప్పూర్‌ జిల్లాలో ఇంధనం ఖరీదు ఎక్కువ’ అని తెలిపారు. 

Also read: మోదీ ర్యాలీ వద్ద పేలుళ్ల కేసు.. 9 మందిని దోషులుగా నిర్దారించిన ఎన్‌ఐఏ కోర్టు..

ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్రలతో సరిహద్దును పంచుకుంటున్న బాలాఘాట్ జిల్లాలో కూడా అదే విధమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 119.23, డీజిల్ ధర రూ. 108.20కి చేరాయి. సరిహద్దు జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol and diesel prices) అధికంగా ఉండటంతో కొందరు వాహనదారులు పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకు లభించే మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు వెళ్లి ఇంధనం కొనుగోలు చేస్తున్నారని పెట్రోల్ పంప్ యజమానులు చెబుతున్నారు. రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాలో ఇంధన వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Also read: టీటీడీ బోర్డులో నేర చరిత్ర ఉన్న వారిని నియమించడంపై హైకోర్టు సీరియస్.. వారికి నోటీసులు..

ఇక, హైదరాబాద్‌లో బుధవారం పెట్రోల్ ధర లీటరుకు 36 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ.112.27కు చేరింది. డీజిల్ రేటు కూడా లీటరుకు 38 పైసలు పెరిగింది. దీంతో డీజిల్ ధర రూ.105.46కు చేరింది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధరలు.. ఢిల్లీలో రూ. 107.94, ముంబైలో రూ. 113.80, బెంగళూరులో రూ. 111.70, చెన్నైలో రూ. 104. 80, కోల్‌కతాలో రూ. 108.45గా ఉన్నాయి. అదే విధంగా లీటర్ డీజిల్ ధరలు.. ఢిల్లీలో రూ. 96.67, చెన్నైలో రూ. 100.92, కోల్‌కతా రూ. 99.78, ముంబై రూ. 104.75, బెంగళూరు రూ. 102.60 గా ఉన్నాయి. 

click me!