ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్న ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సమర్పించినట్టు సమాచారం.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి కేంద్ర ప్రతినిధి, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ రాజీనామా చేశారు. వ్యక్తికారణాల దృష్ట్యా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తన రాజీనామా లేఖలో బైజాల్ పేర్కొన్నారు. బైజాల్ రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు బుధవారం సమర్పించిట్టు సమాచారం.
రిటైర్డ్ సివిల్ సర్వెంట్ అనిల్ బైజాల్ 2016 డిసెంబర్లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు తీసుకున్నారు. నజీబ్ జంగ్ అర్ధంతరంగా రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో అనిల్ బైజాల్ వెంటనే బాధ్యతలు చేపట్టారు. 2013 డిసెంబర్ 31న ఆయన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు తీసుకున్నారు. 2021 డిసెంబర్ 31వ తేదీకే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా ఆయన ఐదేళ్లు పూర్తి చేసుకున్నారు. కానీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కచ్చితమైన పదవీ కాలం ఏమీ లేదు. తాజాగా, ఆయన రాజీనామా కూడా హఠాత్తుగా వార్తల్లోకి వచ్చిందే.
కేంద్రంలోని బీజేపీకి, ఢిల్లీలో అధికారంలోకి ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య జరిగిన పవర్ పాలిటిక్స్లో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కేంద్రబిందువుగా ఉన్న సంగతి తెలిసిందే. అధికారాలపై సుప్రీంకోర్టు మరింత స్పష్టత ఇచ్చే చరిత్రాత్మక తీర్పు వెలువరించే వరకు ఈ రెండింటి మధ్య అధికారాల కోసం తీవ్ర విభేదాలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకునే కొన్ని చర్యలు, నిర్ణయాలను లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న అనిల్ బైజాల్ తోసిపుచ్చి పలుమార్లు వార్తల్లో నిలిచారు.
ఢిల్లీ 21వ లెఫ్టినెంట్ గవర్నర్గా అనిల్ బైజాల్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన రిటైర్డ్ సివిల్ సర్వెంట్. యూనియన్ టెర్రీటరీ క్యాడర్కు చెందిన 1969 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. ఆయన తన 37 ఏళ్ల బ్యూరోక్రాట్ కెరీర్లో ఎన్నో ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థలకు సారథ్యం వహించారు. ఇండియన్ ఎయిర్లైన్స్కు చైర్మన్, ఎండీగా వ్యవహరించారు. ప్రసార భారతి కార్పొరేషన్ సీఈవోగా సేవలు అందించారు. గోవా డెవలప్మెంట్ కమిషనర్గానూ బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ) వైస్ చైర్మన్గా వ్యవహరించారు.