Bengaluru rainfall : కర్నాటకలో మంగళవారం సాయంత్రం కురిసన భారీ వర్షం కారణంగా ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. పలుచోట్ల చెట్లు నేలకూలాయి.. ఇండ్లు నీట మునిగాయి.
Bangalore Rains: కర్నాటక రాజధాని బెంగళూరులో ఎడతెరిపిలేకుండా మంగగళవారం సాయత్రం నుంచి బుధవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. చాలా చోట్ల మొకాళ్ల మట్టం వరకు నీరు నిలిచిపోయింది. అకస్మాత్తుగా భారీ వర్షం కురవడంతో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని అధికారలు తెలిపారు. అనేక చోట్ల చెట్లు నేలకూలాయి. ఇండ్లు నీట మునిగాయి. దాదాపు పన్నెండు గంటలపాటు 114 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. ఈ భారీ వర్ష ప్రభావం కారణంగా డ్రైనేజీలు, కాలువలు పొంగి పొర్లాయి. వీధులన్నీ చెరువులను తలపించాయి. వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.
కర్నాటక రాజధాని బెంగళూరులో భారీ వర్షాల కారణంగా పైప్లైన్ వర్క్సైట్లో ఇద్దరు కూలీలు నీటిలో మునిగి మృతి చెందారు. మంగళవారం (మే 17) సాయంత్రం కురిసిన భారీ వర్షాల కారణంగా బెంగళూరులోని ఉల్లాల్లో పైపులైన్లో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగిపోవడంతో బీహార్కు చెందిన దేవ్వ్రత్, ఉత్తరప్రదేశ్కు చెందిన అంకిత్ కుమార్ అనే కూలీలు నీటిలో మునిగి మృతి చెందారని పోలీసులు తెలిపారు. అక్కడే ఉన్న మరో కార్మికుడు త్రిలోక్ సకాలంలో కావేరి నీటి పైప్లైన్ నుంచి బయటకు రావడంతో అదృష్టవశాత్తూ తప్పించుకున్నాడు. రాజధానిలోని కొన్ని వర్షాల ప్రభావిత ప్రాంతాలను బుధవారం సందర్శించిన కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. పని చేస్తూ మరణించిన ఇద్దరు వలస కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు ప్రకటించారు. ఈ విషయంలో నిర్లక్ష్యానికి పాల్పడినందుకు కాంట్రాక్టర్ను రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. సైట్ ఇంజనీర్ పాత్రను తెలుసుకోవడానికి విచారణ ప్రారంభించారు.
కాగా, కోస్తా జిల్లాలైన దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడిపిలలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జల్లుల కారణంగా బెంగళూరులో వేలాది ఇళ్లు ముంపునకు గురవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇళ్లు నీట మునిగిన వారికి సీఎం బొమ్మై రూ.25 వేలు పరిహారం ప్రకటించారు. గత 24 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో 50 మి.మీ నుంచి 150 మి.మీ వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. హోరామావు, యెలహంక, విద్యాపీఠం, రాజమహల్, నాగపుర, సంపంగిరాంనగర్, విద్యారణ్యపుర, బాణసవాడి, జక్కూరు, సింగసంద్ర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కుండపోత వర్షాల మధ్య చెట్లు కూడా నేలకొరిగాయని బెంగళూరు పౌరసరఫరాల సంస్థ తెలిపింది. భారీ వర్షాల మధ్య బెంగళూరులోని పలు ప్రాంతాలు జలమయమై ట్రాఫిక్ జామ్గా మారాయి.
| Karnataka: Streets and parking places waterlogged in parts of Bengaluru following the rainfall here. Water also enters houses. Visuals from Kalappa Layout, Basavanagar in Bengaluru. pic.twitter.com/hlADx0bAds
— ANI (@ANI)భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ విభాగం బెంగళూరుకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. బుధవారం బెంగళూరులో ఎల్లో అలర్ట్ ప్రకటించడంతో ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం అయ్యారు. బీబీఎంపీ అధికారులు, సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు, అటవి శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నారు.