
2019 ఆగస్టు నుంచి జమ్మూ కాశ్మీర్ లో 118 మంది పౌరులు మృతి చెందారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 21 మంది హిందువులు ఉన్నారని తెలిపింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 5,502 మంది కాశ్మీరీ లోయలోని పండిట్లకు జమ్మూ, కాశ్మీర్ ప్రభుత్వంలోని వివిధ విభాగాలలో ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఆగస్టు 2019 నుండి కాశ్మీరీ పండిట్ ఎవరూ లోయ నుండి వలస వెళ్లలేదని స్పష్టం చేశారు.
Sanitation Workers: పారిశుద్ధ్య కార్మికులకు కొరవడిన రక్షణ.. వారి మరణాలపై కేంద్రం వివరణ
గత మూడేళ్లలో తీవ్రవాద దాడుల్లో గణనీయమైన తగ్గుదల ఉందని నిత్యానంద రాయ్ తెలిపారు. 2018 సంవత్సరంలో మరణాల సంఖ్య 417 ఉందని అన్నారు. అయితే అది 2021లో 229కి తగ్గిందని ఆయన తెలిపారు.“ 2019 ఆగస్టు 5 నుంచి 2022 జూలై 9 వరకు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల చేతిలో 128 మంది భద్రతా దళ సిబ్బంది, 118 మంది పౌరులు మరణించారు. మరణించిన 118 మంది పౌరులలో 5 గురు కాశ్మీరీ పండిట్లు ఉన్నారు. 16 మంది ఇతర హిందూ, సిక్కు వర్గాలకు చెందినవారు ఉన్నారు ’’ అని మంత్రి ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానంలో వెల్లడించారు.
ఏషియానెట్ న్యూస్ వజ్ర జయంతి యాత్ర.. జెండా ఊపి ప్రారంభించిన కర్ణాటక గవర్నర్
అయితే ఈ కాలంలో యాత్రికులు ఎవరూ చనిపోలేదని మంత్రి చెప్పారు. ఉగ్రవాదం పట్ల ప్రభుత్వం జీరో టోలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని తెలిపారు. ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ (పీఎండీపీ) కింద కాశ్మీరీ పండిట్లకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. కాగా జమ్మూ కాశ్మీర్కు ‘ప్రత్యేక హోదా’ కల్పించే ఆర్టికల్ 370 ని 2019 ఆగస్గు 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.