
Punjab: పంజాబ్ సహా దేశంలోని ఐదు రాష్ట్రాలకు ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యుల్ ప్రకటించింది. రాజకీయ పార్టీలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాయి. ఎన్నికల సంఘం సైతం ఓటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ఎన్నికలకు హడావిడి కొలకొన్న పంజాబ్ లో ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలు, పలువురు దుండగుల అరెస్టులు, భారీగా పేలుడు పదార్థం ఆర్డీఎక్స్ అంశాలు కలకలం రేపుతున్నాయి. పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్డీఎక్స్ (RDX) భారీస్థాయిలో పట్టుబడటంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. తాజాగా పేలుళ్లకు ఉపయోగించే 2.5 కిలోల ఆర్డిఎక్స్ పట్టుబడింది.
పాకిస్థాన్ కేంద్రంగా (Pakista )లో పనిచేస్తున్న ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ (ఐఎస్వైఎఫ్)కి చెందిన ఉగ్రవాది లఖ్బీర్ రోడే దీన్ని సరఫరా చేశాడు. వివరాల్లోకెళ్తే.. ఎన్నికల నేపథ్యంలో పంజాబ్ లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలోనే పోలీసులు (Punjab Police) కొద్ది రోజుల క్రితం ఆరుగురు ఐఎస్వైఎఫ్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. గురుదాస్పూర్లోని లఖన్పాల్ గ్రామానికి చెందిన అమన్దీప్ కుమార్ అలియాస్ను విచారించిన తర్వాత ఉగ్రవాదుల్లో ఒకరి వద్ద ఈ భయానక పేలుడు పదార్థం ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది.
అరెస్టు చేసిన వారి వద్ద నుంచి ఆర్డీఎక్స్ తో పాటు, డిటోనేటర్, కోడెక్స్ వైర్, 5 పేలుడు ఫ్యూజులు .. వైర్లు .. ఎకె 47 12 లైవ్ కాట్రిడ్జ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదివరకు పఠాన్కోట్లోని ఆర్మీ కాంట్ గేట్పై గ్రెనేడ్ దాడికి పాల్పడింది ఇదే ఉగ్రవాద సంస్థ కావడం గమనార్హం. దీంతో ఈ ఉగ్రవాద సంస్థ పంజాబ్ లో భారీ విధ్వంసాన్ని సృష్టించడానికి సిద్ధం అయిందనే వాదనలకు బలం చేకూరుతోందని పోలీసులు అంచనాకు వచ్చారు. ఎస్బీఎస్ నగర్ ఎస్ఎస్పీ కన్వర్దీప్ కౌర్ నిందితుడు అమన్దీప్ను విచారించిన వెంటనే, గురుదాస్పూర్ జిల్లాకు పోలీసు బృందాలను పంపడం ద్వారా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థం ద్వారా ఐఈడీలను సమీకరించాల్సి ఉందని అమన్దీప్ తెలిపారు. ఈ పేలుడు పదార్థాలను ఈ టెర్రర్ మాడ్యూల్ హ్యాండ్లర్ అయిన సిక్కు భిఖారీవాల్ పాకిస్థాన్లో ఉన్న ఉగ్రవాది లఖ్బీర్ రోడ్ ద్వారా తనకు పంపాడని అమన్దీప్ చెప్పినట్లు ఎస్ఎస్పీ కన్వర్దీప్ కౌర్ వెల్లడించారు.
జూన్-జూలై 2021లో, లఖ్బీర్ రోడ్, పాకిస్తాన్లో కూర్చొని, పంజాబ్ .. బయటి దేశాలలో తన టెర్రర్ మాడ్యూల్ ద్వారా వరుస ఉగ్రవాద సంఘటనలను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే భారీ పేలుడు పదర్థాలు.. ఆర్డీఎక్స్, టిఫిన్ బాంబులతో సహా భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను సరిహద్దు నుంచి భారత్కు అక్రమంగా తరలిస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా డ్రోన్లను సైతం ఉపయోగిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇందులో స్మగ్లింగ్ ముఠా హస్తం కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా, పంజాబ్ లో ఒకే దశలో 117 అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశలో ఫిబ్రవరి 14న పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. జనవరి 28తో నామినేషన్లు ముగియనున్నాయి. జనవరి 30 వరకూ విత్డ్రాలకు అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 14న పోలింగ్ జరుగుతోంది. ఫలితాలను మాత్రం మార్చి 10న వెల్లడిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది.