
తమిళనాడు రాజధాని చెన్నైలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. స్కూల్ నుంచి తిరిగి వస్తున్న తొమ్మిదేళ్ల బాలికపై పొగరబోతు ఆవు తీవ్రంగా దాడి చేసింది. కాళ్లతో తొక్కింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాలు.. బాధిత బాలిక జాఫర్ సిద్ధిక్ అలీ కుమార్తె ఆయేషా. అయేషాను, ఆమె తమ్ముడిని ఆమె తల్లి బుధవారం స్కూల్ నుంచి తీసుకుని వస్తుండగా ఎంఎండీఏ కాలనీలో బాలికపై ఆవు దాడి చేసింది. వారి ముందు వెళ్తున్న ఆవు, దాని పిల్ల ఒక్కసారిగా వెనక్కి తిరిగి బాలికపై దాడికి దిగాయి. బాలికను ఆవు కొమ్ములతో ఎత్తి రోడ్డుకు ఒక పక్కన పడేసింది. ఆ తర్వాత కొమ్ములతో దాడి చేస్తూ, కాళ్లతో తొక్కడం ప్రారంభించాయి.
దీంతో బాలిక తల్లికి ఏం చేయాలో అర్థం కాలేదు. తన కళ్లముందే కూతురుపై ఆవు దాడి చేస్తుంటే ఎలా కాపాడుకోవాలనేది అర్థం కాలేదు. దీంతో పెద్దగా కేకలు వేయసాగింది. అయితే స్థానికులు వచ్చి ఆవు దాడి నుంచి బాలికను విడిపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కొందరు రాళ్లు రువ్వి ఆవు బారి నుంచి బాలికను రక్షించే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దాదాపు ఒక నిమిషం పాటు బాలికపై ఎద్దు దాడి చేసింది. చివరకు పెద్ద సంఖ్యలో ప్రజలు రాళ్లు రువ్వడం, ఇతర మార్గాల ద్వారా ఆవును అక్కడి నుంచి తరిమివేశారు.
(గమనిక: ఈ వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలిచివేయవచ్చు..)
ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స పొందుతోంది. ఈ ప్రాంతంలో అనేక ఆవులు విచ్చలవిడిగా స్వైరవిహారం చేయడంతో ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనకు గురి చేసింది. ఇక, బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఎంఎండీఏ కాలనీలోని ఎంజీఆర్ వీధికి చెందిన ఆవు యజమాని వివేక్పై అరుంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.