కరోనా వైరస్: ముంబైలో 'మహా' జంప్, మహారాష్ట్రలో 6 వేలు దాటిన కేసులు

By telugu teamFirst Published Apr 24, 2020, 8:15 AM IST
Highlights

మహారాష్ట్ర కరోనా వైరస్ వ్యాప్తితో అట్టుడుకుతోంది. గురువారంనాడు పెద్ద యెత్తున కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరణాలు రికార్డయ్యాయి. ముంబైలో పాజిటివ్ కేసుల సంఖ్య 4 వేలు దాటింది.

ముంబై: కరోనా వైరస్ కేసుల విజృంభణతో మహారాష్ట్ర పరిస్థితి దారుణంగా మారింది. దేశ ఆర్థిక రాజధానిగా పేరు గాంచిన ముంబై పరిస్థితి చెప్పడానికి వీలు లేని స్థితిలో ఉంది.  మహారాష్ట్రలో గురువారం ఒక్క రొజే కొత్తగా 778 కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 6,427కు చేరుకుంది. 

మహారాష్ట్రలో గురువారం ఒక్క రోజే కొత్తగా 14 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మహారాష్ట్రలో మరణాల సంఖ్య 283కు చేరుకుంది. ముంబైలో గురువారంనాడు అదనంగా 522 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,025కు చేరుకుంది. కరోనా వైరస్ తో ముంబైలో 167కు చేరుకుంది. 

ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ అయిన ధారవిలో పరిస్థితి వర్ణించడానికి వీలు లేని స్థితిలో ఉంది. ఈ మురికివాడలో 8 లక్షల మంది జీవిస్తుంటారు. ఈ మురికివాడలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 214కు చేరుకుంది. ఇప్పటి వరకు 13 మంది మరణించారు. 

ముంబైని కేంద్ర ప్రభుత్వం కోవిడ్ -19 హాట్ స్పాట్ గా గుర్తించింది. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి పలు చర్యలు తీసుకుంటోంది. ముంబైలో బృహముంబై నగర పాలక సంస్థ 813 కంటైన్మెంట్లను ఏర్పాటు చేసింది. ఈ కంటైన్మెంట్ల నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా, ఎవరూ లోనికి రాకుండా కట్టడి చేస్తోంది. కరోనా వైరస్ మరణాలను కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చెప్పారు. 

click me!