సెప్టెంబర్ నాటికి భారత్‌లో 111 కోట్ల మందికి కరోనా: అమెరికా సంస్థ అంచనా

By Siva KodatiFirst Published Apr 23, 2020, 8:02 PM IST
Highlights

మనదేశంలో సెప్టెంబర్ నాటికి 111 కోట్ల మంది వైరస్ బారిన పడతారని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్, డైనమిక్స్  అండ్ ఎకనామిక్ పాలసీ (సీడీడీఈపీ) ఏప్రిల్ 20 నాటి తన నివేదికలో పేర్కొంది. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజుకి పెరుగుతోంది. ప్రభుత్వాలు లాక్‌డౌన్, సామాజిక దూరం వంటి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నప్పటికీ కోవిడ్ 19 వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. ఇటు భారతదేశంలోనూ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.

అయితే మనదేశంలో సెప్టెంబర్ నాటికి 111 కోట్ల మంది వైరస్ బారిన పడతారని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్, డైనమిక్స్  అండ్ ఎకనామిక్ పాలసీ (సీడీడీఈపీ) ఏప్రిల్ 20 నాటి తన నివేదికలో పేర్కొంది.

Also Read:78 జిల్లాల్లో 14 రోజులుగా కరోనా కేసులు లేవు,వీటికి లాక్ డౌన్ ఆంక్షల ఎత్తివేత: కేంద్రం

కఠినమైన లాక్‌డౌన్, సామాజిక దూరం వంటివి కొనసాగించినప్పటికీ కేసుల సంఖ్యను అదుపు చేయడం సాధ్యం కాదని.. ఈ సంఖ్య 55 నుంచి 138 కోట్ల మంది భారతీయులు కోవిడ్ 19 బారినపడొచ్చని ఈ సంస్థ అభిప్రాయపడింది.

మార్చి 24న ఈ సంస్థ వెలువరించిన నివేదికలో భారత్‌లో సుమారు 12 నుంచి 24 కోట్ల మంది వైరస్ బారినపడతారని విశ్లేషించింది. భారతదేశంలో లాక్‌డౌన్‌ వంటి కఠినమైన ఆంక్షలను కొనసాగించాలని ఈ నివేదిక సూచించింది.

అంటువ్యాధులు సోకినవారితో ఆసుపత్రులు కిక్కిరిసి ఉండకుండా ఎప్పటికప్పుడు పరిమితులు కఠినతరం చేయాలని పేర్కొంది. అయితే లాక్‌డౌన్‌లో తరచుగా మార్పులు  చేయడం వల్ల రాష్ట్రాల మధ్య, రాష్ట్రాలు కేంద్రప్రభుత్వం మధ్య వివాదాలు జరిగే అవకాశం ఉందని సీడీడీఈపీ అభిప్రాయపడింది.

Also Read:కరోనా ఎఫెక్ట్: జార్ఖండ్‌లో కుటుంబం బహిష్కరణ, విచారణకు ఆదేశం

మరోవైపు 78 జిల్లాల్లో 14 రోజుల నుంచి కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదని కేంద్రం గురువారం ప్రకటించింది. ఈరోజు నాటికి 28 రోజుల  కంటే ఎక్కువ రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కానీ జిల్లాలు 12 ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రకటించారు. గడచిన 24 గంటల్లో దేశంలో 1,409 కొత్త కేసులు నమోదయ్యాయని, వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 21,393కి చేరుకుందని ఆయన చెప్పారు. 

click me!