మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం.. హాజ‌రైన ప్ర‌ధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా

Published : Mar 07, 2023, 12:09 PM IST
మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం.. హాజ‌రైన ప్ర‌ధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా

సారాంశం

Shillong: ప్రధాని న‌రేంద్ర‌మోడీ స‌మక్షంలో మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర సీఎంగా నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ సంగ్మా వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి కాగా, మొత్తం 11 మంత్రుల్లో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు గా ప్రమాణ స్వీకారం చేశారు.

Conrad Sangma takes oath as the Chief Minister of Meghalaya: నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ కాన్రాడ్ సంగ్మా మంగళవారం షిల్లాంగ్ లో ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో మేఘాలయ ముఖ్యమంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయ‌న‌ ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు సహా మరో 11 మందితో కలిసి వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. మేఘాల‌య అసెంబ్లీకి  ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగిన 59 స్థానాలకు గాను 26 స్థానాలను కైవసం చేసుకుని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, 60 మంది సభ్యుల అసెంబ్లీలో పార్టీ మ్యాజిక్ ఫిగర్ 31 కంటే తక్కువగా ఉండటంతో మ‌రో పార్టీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ఎన్పీపీ నేత‌లు పేర్కొన్నారు. తాజాగా బీజేపీతో క‌లిసి ఎన్పీపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రమాణ స్వీకార కార్య‌క్ర‌మానికి బీజేపీ అగ్ర‌నేత‌లు హాజ‌ర‌య్యారు. మేఘాలయ గవర్నర్ ఫాగు చౌహాన్ ఎన్పీపీకి చెందిన ప్రెస్టోన్ టిన్సాంగ్, బీజేపీకి చెందిన అలెగ్జాండర్ లాలూ హెక్ సహా 12 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. టిన్సాంగ్, స్నియాభలాంగ్ ధార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) నుంచి 8 మంది, యూడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ, హెచ్ఎస్పీడీపీ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్యేలు రాజ్ భ‌వ‌న్ లో సంగ్మా క్యాబినెట్ లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అసోం ముఖ్యమంత్రి, ఎన్ఈడీఏ కన్వీనర్ హిమంత బిశ్వశర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్పీపీ నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మార్క్యూస్ ఎన్ మరక్, రక్కం ఎ సంగ్మా, అంబరీన్ లింగ్డో, కమోన్ యాంబోన్, ఏటీ మొండల్ ఉన్నారు. బీజేపీకి చెందిన ఏఎల్ హెక్, యూడీపీకి చెందిన పాల్ లింగ్డో, కిర్మెన్ షైల్లా, హెచ్ఎస్పీడీపీకి చెందిన షక్లియార్ వార్జ్రీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకారానికి రాజ్ భవన్ కు బయలుదేరే ముందు కాన్రాడ్ సంగ్మా మంగళవారం క్యాబినెట్ మంత్రులందరితో ప్ర‌త్యేక పూజా కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన్నారు. కాగా, 45 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఎన్పీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావ‌డంతో ప్ర‌భుత్వం మేఘాల‌య‌లో సంకీర్ణ ప్ర‌భుత్వం కొలువుదీరింది. సంగ్మా దక్షిణ తురా నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బెర్నార్డ్ ఎన్ మరక్ పై 5,016 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గురువారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ) 11 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ ఐదు స్థానాలను గెలుచుకుంది. గత అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ చేర్చుకున్న తృణమూల్ కాంగ్రెస్ కు కూడా ఐదు సీట్లు వచ్చాయి.

బీజేపీ, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్, హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ చెరో రెండు స్థానాలను గెలుచుకున్నాయి. వాయిస్ ఆఫ్ పీపుల్ పార్టీకి నాలుగు సీట్లు వచ్చాయి. రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ, ఎన్పీపీలు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !