కాంగ్రెస్‌లో మార్పులు.. వన్ ఫ్యామిలీ వన్ టికెట్ సహా ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్.. వీటికి తిరస్కరణ

Published : May 15, 2022, 04:12 PM IST
కాంగ్రెస్‌లో మార్పులు.. వన్ ఫ్యామిలీ వన్ టికెట్ సహా ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్.. వీటికి తిరస్కరణ

సారాంశం

కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల చింతన్ శిబిర్ కార్యక్రమం నేటితో ముగుస్తున్నది. ఈ మూడు రోజుల సదస్సులో పార్టీ కీలక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో వన్ ఫ్యామిలీ వన్ టికెట్ రూల్‌కు ఆమోదం తెలిపింది. యువతకు ప్రాధాన్యత, ఐదేళ్ల నిబంధన వంటి ప్రతిపాదనలకు ఆమోదం తెలుపగా, పార్లమెంటరీ బోర్డు ఏర్పాటును వ్యతిరేకించినట్టు సమాచారం.  

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేసి నూతనోత్తేజంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నది. పార్టీ సీనియర్ నాయకత్వంలోనూ అధినాయకత్వంపై వ్యతిరేకత ఇటీవల ఎక్కువైంది. సమూల మార్పులు చేపట్టాలని, పార్టీ నిబంధనలను ప్రక్షాళనం చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల మేధోమథన సదస్సు చింతన్ శిబిర్‌ను నిర్వహించింది. ఈ సమావేశంలో కీలక ప్రతిపాదనలకు పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వివరాలు పరిశీలిద్దాం.

వన్ ఫ్యామిలీ వన్ టికెట్:
కాంగ్రెస్ పార్టీ ఆమోదించిన ప్రతిపాదనల్లో ఒక కుటుంబం, ఒక టికెట్ నిబంధన ఉన్నది. ఈ నిబంధన ప్రకారం, టికెట్లను పార్టీ నేతల కుటుంబీకులకు, బంధువులకు ఇవ్వరు. లేదా పార్టీ కోసం కనీసం ఐదు సంవత్సరాలు క్రియాశీలకంగా పని చేసి ఉండాలి. ఇలా పని చేసి ఉంటే.. పార్టీ నేతతోపాటు ఐదేళ్లు పని చేసిన వారికీ టికెట్ ఇవ్వడానికి అర్హత ఉంటుంది.

ఐదేళ్ల నిబంధన:
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సహా జిల్లా, బ్లాక్ కమిటీలు, ఇతర శాఖలు, సెల్‌లు, ఫ్రాంటల్ ఆర్గనైజేషన్‌లలోనూ పార్టీ పదవులు ఐదేళ్లు మాత్రమే నిర్వహించాలనే నిబంధనను కాంగ్రెస్ సమ్మతించినట్టు సమాచారం. పార్టీ పదవులు చేపట్టేవారు ఐదేళ్ల తర్వాత రాజీనామా చేయాల్సే ఉంటుంది. ఒక వేళ మళ్లీ అదే పోస్టు సదరు వ్యక్తి చేపట్టాలంటే.. మూడేళ్లపాటు పదవికి దూరంగా ఉండాలి. దీన్ని కూలింగ్ పీరియడ్‌గా పేర్కొన్నారు.

యువతకు ప్రాధాన్యత:
కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కమిటీలో యువతకు ప్రాధాన్యత ఇచ్చింది. 50 శాతం కమిటీ సభ్యులు 50 ఏళ్లలోపు వారే అయి ఉండాలనే ప్రతిపాదనను ఆమోదించింది.

ప్రజలకు చేరువవ్వడానికి
ప్రజలకే చేరువ కావడానికి, బీజేపీని ఎదుర్కోవడానికి పాదయాత్రలు, జనతా దర్బార్‌లు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

పొలిటికల్ అడ్వైజరీ గ్రూప్:
వీటితోపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మరో కీలక ప్రతిపాదనను ఆమోదించినట్టు తెలిసింది. ఈ బాడీలోపలే ప్రత్యకంగా ఒక చిన్న పొలిటికల్ అడ్వైజరీ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. సంస్థాగత, విధానపరమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోవడానికి ఈ గ్రూపు పార్టీ అధ్యక్షులకు సహకరిస్తుంది. 

పార్లమెంటరీ బోర్డుకు నో:
కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ బోర్డు ఏర్పాటు చేయడానికి సీడబ్ల్యూసీ నిరాకరించింది. ఈ బోర్డు ఏర్పాటు చేస్తే పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయడంలో గాంధీ కుటుంబ అధికారులకు కత్తెర వేసినట్టు అవుతుంది. ప్రస్తుతం ఎలక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.

కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారమే పార్లమెంటరీ బోర్డు ఉండేది. పీవీ నరసింహా రావు ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ బోర్డును రద్దు చేశారు. అప్పటి నుంచి ఈ బోర్డు అమలు కాలేదు. తాజాగా, మళ్లీ దీన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉండింది. కానీ, ఈ ప్రతిపాదనను తిరస్కరించడంతో  కాంగ్రెస్ రెబల్స్ కలత చెందినట్టు తెలుస్తున్నది. వారి డిమాండ్లలో పార్లమెంటరీ బోర్డు ప్రధానంగా ఉన్నది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ | CM Vijay Powerful Speech in Tamil Nadu Assembly
ఉచితంగా బంగారం.. సీఎం విజయ్ బర్త్ డే గిఫ్ట్ | Tamil Nadu CM Vijay Birthday Special Gold Rings Gifted