
Chinese Cargo Ship Fire Off Kerala Coast:: కేరళలోని అజికల్ తీరం నుండి 44 నాటికల్ మైళ్ళ దూరంలో సముద్రంలో ఒక చైనా కంటైనర్ నౌక (MV Wan Hai 503) లో పేలుడు జరిగింది. ఈ అగ్నిప్రమాదం నుంచి నౌకలో ఉన్న 22 మంది సిబ్బందిలో 18 మందిని భారత నావికాదళం, ముంబై కోస్ట్ గార్డ్ రక్షించారు. ఈ నేపథ్యంలోనే చైనా దౌత్య కార్యాలయం భారత రెస్క్యూ బృందానికి కృతజ్ఞతలు తెలిపింది, గాయపడిన వారికి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
చైనా దౌత్య కార్యాలయ ప్రతినిధి యు జింగ్, భారత నావికాదళం, కోస్ట్ గార్డ్ చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎక్స్ వేదికగా కూడా స్పందించారు.
సింగపూర్ జెండా ఉన్న ఈ నౌక (Singapore-flagged MV Wan Hai 503) 270 మీటర్ల పొడవు ఉంది. జూన్ 7న కొలంబో నుండి బయలుదేరి ముంబైలోని నవ శివా పోర్ట్ కి వెళ్తుండగా జూన్ 10న పేలుడు, అగ్నిప్రమాదం జరిగాయి. నౌకలో 22 మంది సిబ్బంది ఉన్నారు, వారిలో 14 మంది చైనా దేశస్థులు, 6 మంది తైవాన్ వారు ఉన్నారు.
భారత కోస్ట్ గార్డ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. INS సూరత్ గాయపడిన వారిని న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీ (NMPA) పనంబూర్ లోని కోస్ట్ గార్డ్ డాక్ కి తరలించింది. గాయపడిన వారిని ఏజే హాస్పిటల్, కుంటికానలో చేర్చారు. ICGS రాజ్దూత్ (న్యూ మంగళూరు), ICGS అర్ణవేష్ (కొచ్చి), ICGS సాచెట్ (అగట్టి) లను కూడా రెస్క్యూ కోసం పంపారు. రెండు డోర్నియర్ విమానాలను ఎయిర్ సర్వైలెన్స్ కోసం ఉపయోగించారు.
ICG అధికారుల ప్రకారం, నౌక 10 నుండి 15 డిగ్రీలు ఎడమవైపు ఒరిగింది. కొన్ని కంటైనర్లు సముద్రంలో పడ్డాయి. అగ్ని ప్రమాదం అదుపులోకి వచ్చినా, చిన్న పేలుళ్ళు, పొగ వస్తోంది. పలువురు సిబ్బంది గల్లంతయ్యారు.
ఈ ఆపరేషన్ తర్వాత చైనా, భారత్ పాత్రను ప్రశంసించింది. ఇరు దేశాల ఉద్రిక్తలు ఉన్న సమయంలో జరిగిన ఈ ఘటన సముద్ర సహకారానికి మంచి ఉదాహరణగా పేర్కొంది.