గ్రేటర్ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కార్మికులపైకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి..

By Sumanth KanukulaFirst Published Feb 9, 2023, 9:43 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న కార్మికులపైకి బస్సు దూసుకెళ్లింది.

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న కార్మికులపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. బాదల్‌పూర్ ప్రాంతంలో ఉన్న హీరో మోటార్స్ కంపెనీ ఉద్యోగుల నైట్ షిప్ట్‌కు వెళ్తున్న సమయంలో దాద్రీ నుంచి నోయిడా వైపు వెళ్తున్న బస్సు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు పంచనామా చేసి పోస్టుమార్టంకు తరలించారు. 

‘‘బాదల్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న హీరో మోటార్స్ కంపెనీ కార్మికులు తమ నైట్ షిఫ్టులకు వెళ్తున్నారు. ఉత్తరప్రదేశ్ రోడ్‌వేస్‌కు చెందిన నోయిడా డిపో బస్సు వారిని ఢీకొట్టింది. దంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. తర్వాత మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోబడుతున్నాయి’’అని సెంట్రల్ నోయిడా ఏడీసీపీ విశాల్ పాండే తెలిపారు.

ఇక, ఈ ప్రమాదంలో మృతిచెందినవారిని బీహార్‌కు చెందిన సంకేశ్వర్ కుమార్ (25), మోహ్రీ కుమార్ (22), ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సతీష్ కుమార్ (25), గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాకు చెందిన గోపాల్ (34)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తోంది. 

click me!