
ఇండోర్: మధ్యప్రదేశ్లో పెళ్లి వేడుక విషాదంగా మారిపోయింది. నవ దంపతులు పెళ్లి తంతు జరుగుతుండగానే విషం తాగారు. నవ వరుడు మరణించగా.. నవ వధువు పరిస్థితి ఆరోగ్యం విషమంగా ఉన్నది. మంగళవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
21 ఏళ్ల యువకుడు, 20 ఏళ్ల యువతి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, కెరీర్ నిర్మించుకోవాలని, కొంత నిలదొక్కుకున్నాక పెళ్లి చేసుకోవాలని యువకుడు భావించాడు. ఇందులో భాగంగానే పెళ్లి నిర్ణయాన్ని రెండేళ్లపాటు వాయిదా వేయాలని యువతికి చెప్పాడు. కానీ, ఆమె అంగీకరించలేదు. వెంటనే పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసింది. కొన్ని రోజులుగా పెళ్లి గురించి ఆమె తరుచూ అడుగుతున్నట్టు తెలిసింది.
ఎట్టకేలకు వారి పెళ్లి కన్నడియా ఏరియాలోని ఆర్య సమాజ్ టెంపుల్లో నిర్వహించడానికి నిర్ణయం జరిగింది. పెళ్లికి అంతా సిద్ధమైంది. కానీ, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుల మధ్య మరోసారి గొడవ జరిగింది.
మనస్తాపంతో పెళ్లి కొడుకు విషం తాగాడు. ఈ విషయం పెళ్లి కూతురుకు తెలిసింది. వెంటనే వెళ్లి ఆమె కూడా ఆ విషాన్ని తాగింది. ఆ నవవరుడిని హాస్పిటల్కు తరలించారు. కానీ, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు తేల్చారని ఏఎస్ఐ రంజాన్ ఖాన్ తెలిపారు. కాగా, ఆ మహిళ ఆరోగ్యం మాత్రం విషమంగా ఉన్నదని, సపోర్ట్ సిస్టమ్ పై ఉంచినట్టు వివరించారు.
పెళ్లి కొడుకు కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం, గత కొన్ని రోజులుగా పెళ్లి చేసుకోవాలని ఆ యువతి యుకుడిని వేధించింది. కెరీర్ పటిష్టంగా ఏర్పరుచుకోవడానికి రెండేళ్ల సమయం కావాలని, ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని యువకుడు చెప్పాడు. కానీ, ఆమె అంగీకరించలేదు. సరికదా ఆ యువకుడిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వివరించారు.