
న్యూఢిల్లీ: కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ఎవరనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య, ఒకే ఒక్క డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టనున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ గురువారం అధికారికంగా వెల్లడించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక కాంగ్రెస్ ఇంచార్జ్ం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాకారం చేసేందుకు పార్టీ అగ్రనాయకత్వంతో పార్టీ నేతలందరూ చాలా కష్టపడ్డారని చెప్పారు.
తమ ప్రజాస్వామ్య పార్టీ అని.. నియంతృత్వం కాదని చెప్పారు. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యను, ఒకే ఒక్క డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ను నిర్ణయించామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు డీకే శివకుమార్ కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతారని తెలిపారు. కర్ణాటక నూతన సీఎంను అధికారికంగా ఎన్నుకునేందుకు బెంగళూరులో ఈ సాయంత్రం కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం జరుగుతుందని తెలిపారు. మే 20న సీఎం, డిప్యూటీ సీఎం, కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టుగా వెల్లడించారు.