
పాట్నా: బిహార్(Bihar) ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్(State Budget) ప్రవేశపెట్టింది. బిహార్ ఆర్థిక శాఖ మంత్రి తారకిశోర్ ప్రసాద్(Tarkishore Prasad) ఈ రోజు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 2,37,69,119 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆయన ప్రవేశపెట్టారు. ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో బిహార్ వికాసానికి ఆరు సూత్రాలను పేర్కొన్నారు. అందులో ఆరోగ్యం, విద్య, ఉద్యోగాల కోసం పెట్టుబడులు, వ్యవసాయ రంగం, గ్రామీణ, పట్టణ అభివృద్ధి, భిన్నవర్గాల సంక్షేమం ఆధారంగా ఈ బడ్జెట్ రూపొందించినట్టు వివరించారు.
తమకు అందని దానిని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించడం, అందిన దానిని సంరక్షించుకోవడం, కాగా సంరక్షణలో ఉన్నదాన్ని అందరికీ సమానంగా పంపిణీ చేయడం అని అర్థాన్ని ఇచ్చే ఓ సంస్కృత శ్లోకాన్ని ఆర్థిక శాఖ మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. బడ్జెట్లో పైన పేర్కొన్న ఆరు సూత్రాలు ప్రధాన భూమిక పోషిస్తాయని వివరించారు. ఆర్థిక శాఖ మంత్రి తన బడ్జెట్ ప్రసంగాన్ని 45 నిమిషాల పాటు ఇచ్చారు. గత బడ్జెట్లో ఆయన 54 నిమిషాలపాటు ప్రసంగించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి బిహార్ బడ్జెట్ను రూ. 2.37 లక్షల కోట్లుగా ప్రకటించింది. కాగా, గత ఏడాది(2021-22 ఆర్థిక సంవత్సరం) ప్రవేశపెట్టిన బడ్జెట్ రూ. 2.18 లక్షల కోట్లుగా వెల్లడించింది.
ఈ బడ్జెట్లోని కొన్ని కీలకాంశాలు చూద్దాం. గతేడాదితో పోల్చితే ఈ సారి బడ్జెట్ సైజు పెంచింది. గతేడాది బడ్జెట్ రూ. 2.18 లక్షల కోట్లుగా ఉండగా, ఈ ఏడాది బడ్జెట్ రూ. 2.37 లక్షలకు పెరిగింది. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యకు పెద్దపీట వేశారు. విద్య కోసం అత్యధికంగా రూ. 39191 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అంటే.. మొత్తం బడ్జెట్లో ఇది 16.5 శాతం. కాగా, వ్యవసాయ రంగానికి రూ. 29,749 కోట్లను, ఉపాధి కల్పన కోసం రూ. 16,4374 కేటాయించింది.
స్వచ్ఛ గ్రామాలు, సమృద్ధ గ్రామాల కోసం రూ. 749 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. దీని కింద ప్రతి గ్రామ వీధుల్లో సోలార్ లైట్లను ఏర్పాటు చేస్తారు. అలాగే, ప్రతి ఇంటికి నీటి కుళాయి కోసం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1,110 కోట్ల బడ్జెట్ను కేటాయించింది.
మహిళా సాధికారత కింద ఇంటర్ ఉత్తీర్ణులైన యువతులకు రూ. 25 వేలు, డిగ్రీ పట్టా పొందిన అవివాహిత మహిళలకు రూ. 50 వేల మద్దతు ఇవ్వాలని బిహార నిర్ణయించింది. ఇందుకోసం నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ. 900 కోట్లను కేటాయించింది. అలాగే, తమ ప్రభుత్వం మైనార్టీలు, అల్పాదాయ వర్గాలు, అణగారిని వర్గాల సంరక్షణ కోసం కట్టుబడి ఉన్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి తారకిశోర్ ప్రసాద్ తెలిపారు. వారి అభివృద్ధి కోసం బడ్జెట్ల రూ. 16,134 కోట్లను కేటాయించింది. మొత్తంగా రాష్ట్ర బడ్జెట్లో 65 శాతం సామాజిక వర్గాలపై నేరుగా ఖర్చు పెడుతున్నది. తమ ప్రభుత్వ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నదని మంత్రి అన్నారు.