
హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల నగరంలో ఖలిస్తానీ జెండాలను ఉంచి, గోడలపై నినాదాలు రాసిన కేసులో మరో పంజాబ్ వాసిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయంపై సీఎం జైరామ్ ఠాకూర్ ట్విట్టర్ లో స్పందించారు. ‘‘ దేశాన్ని విభజించే శక్తులకు వ్యతిరేకంగా ప్రతి హిమాచలీ ఐక్యంగా ఉన్నారు ’’ అని ట్వీట్ చేశారు.
‘‘ ధర్మశాలలో ఖలిస్తానీ జెండాలను ఉంచి గోడపై నినాదాలు రాసిన మరో వ్యక్తిని కూడా పంజాబ్ నుంచి అరెస్టు చేశారు. దేశాన్ని విభజించే శక్తులకు వ్యతిరేకంగా ప్రతి హిమాచలీ ఐక్యంగా ఉంటారు. లాంగ్ లివ్ మదర్ ఇండియా. జై హింద్, జై హిమాచల్ ’’ అని ఠాకూర్ ట్వీట్ చేశారు.
ఖలిస్తాన్ల దుశ్చర్య..? హిమాచల్ అసెంబ్లీ గేటుపై ఖలిస్తాన్ జెండాలు.. గోడలపై రాతలు
హిమాచల్ ప్రదేశ్ పోలీసులతో కలిసి జరిపిన సంయుక్త దాడిలో ధర్మశాలలోని హిమాచల్ అసెంబ్లీ గోడపై ఖలిస్తాన్ అనుకూల జెండాలు, నినాదాలు రాసిన కేసులో మోరిండా నివాసిని అరెస్టు చేసినట్లు రూప్ నగర్ ఎస్ఎస్పీ డాక్టర్ సందీప్ గార్గ్ తెలిపారు.
ఏప్రిల్ 13వ తేదీన పంజాబ్ రోపార్ లోని మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ వెలుపల ఖలిస్తాన్ బ్యానర్లను తన సహచరుడితో కలిసి ఉంచినట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు. దీంతో నిందితులను హిమాచల్ పోలీసులకు అప్పగించారు. రోపార్ పోలీసులు నిందితులను తిరిగి ప్రొటెక్షన్ వారెంట్ పై తీసుకువస్తారని ఎస్ఎస్పీ గార్గ్ తెలిపారు. నిందితుడి మరో సహచరుడిని గుర్తించామని, త్వరలోనే పట్టుబడతామని ఆయన తెలిపారు.
ఖలిస్తాన్ జెండాలు ఉంచిన ఘటనకు సంబంధించి ఇది రెండో అరెస్టు. మే 8వ తేదీన అసెంబ్లీ ప్రధాన ద్వారం గోడలపై ఖలిస్తాన్ జెండాలు అమర్చిన కేసులో హిమాచల్ ప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గత బుధవారం ఒక నిందితుడిని అరెస్టు చేసింది. కాగా ఖలిస్తాన్ జెండాల ఘటన తర్వాత ధర్మశాల పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 153-ఏ, 153-బీ, HP ఓపెన్ ప్లేసెస్ (వికృతీకరణ నిరోధక) చట్టం 1985లోని సెక్షన్ 3, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) సెక్షన్ 13 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ‘‘సిక్కుస్ ఫర్ జస్టిస్’’ (SFJ) జనరల్ కౌన్సిల్ గురుపత్వంత్ సింగ్ పన్నూపై కూడా కేసు నమోదైంది.