
న్యూఢిల్లీ : పశ్చిమ ఢిల్లీలోని ముండ్కాలోని నాలుగు అంతస్తుల వాణిజ్య భవనంలో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో కనీసం 27 మంది మరణించగా, 12 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ ఘటనలో గాయపడ్డ బాధితుల గుర్తింపుకు సంబంధించిన వివరాలను ఇంకా పోలీసులు తెలుపలేదు. క్షతగాత్రులను సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదం తరువాత ఆ భవనం నుండి కనీసం 60 మందిని రక్షించారని, మరికొందరు ఇంకా లోపల చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు.
మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఢిల్లీ ఫైర్ సర్వీస్ క్రేన్లను మోహరించింది. అయితే, మంటల వల్ల భవనం మొత్తం పొగలు వ్యాపించాయి. దీంతో కొంతమంది తమను తాము రక్షించుకోవడానికి కిటికీల నుండి దూకేశారు. మరికొందరు క్రిందికి దిగడానికి తాళ్లను ఉపయోగించారు.
సీసీటీవీ కెమెరాలు, రూటర్ల తయారీ కంపెనీ కార్యాలయం ఉన్న భవనంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (అవుటర్) సమీర్ శర్మ తెలిపారు.
కంపెనీ యజమానులు హరీష్ గోయెల్, వరుణ్ గోయెల్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అగ్నిమాపక శాఖ నుంచి సేఫ్టీ క్లియరెన్స్ లేని ఈ భవనానికి లేదని గుర్తించారు. దీని యజమాని మనీష్ లాక్రాగా గుర్తించామని, అతడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
మంటలు చెలరేగినప్పుడు రెండవ అంతస్తులో ఓ ప్రసంగ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు. అందువల్ల అత్యధిక మరణాలు ఈ అంతస్తులోనే జరిగాయని ప్రాథమిక విచారణలో తేలింది.
అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సాయంత్రం 4.40 గంటలకు మంటలు చెలరేగినట్లు సమాచారం అందడంతో 24 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే ఈ భవనానికి ఒక్కటే మెట్ల మార్గం మాత్రమే ఉన్నందున ప్రజలు భవనం నుండి తప్పించుకోలేకపోయారని అగ్నిమాపక శాఖ డివిజనల్ అధికారి తెలిపారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ నాయకులు ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలిపారు.
ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు ఇస్తామని ప్రధాని చెప్పారు. గాయపడిన వారికి రూ. 50,000 ఇవ్వనున్నట్లు ఆయన కార్యాలయం ట్వీట్ చేసింది. తాను అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డిఆర్ఎఫ్) సేవలందించిందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు.