
ముంబయి: ప్రముఖ వ్యాపారదిగ్గజం ముఖేశ్ అంబానీ నివాసం ‘అంటిలియా’ ముందు పార్క్ చేసిన ఓ కారులో పేలుడు పదార్థాలు లభించడం ఫిబ్రవరి నెలలో మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఈ కేసుతోనే డిస్మిస్ అయిన ముంబయి పోలీసు అధికారి సచిన్ వాజే పేరు మారుమోగడమే కాదు, తర్వాత అప్పటి ముంబయి సీపీ పరమ్ వీర్ సింగ్ రాష్ట్ర హోం మంత్రిపై చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇటీవలే ఈ పేలుడుపదార్థాల కారుకు సంబంధించిన కేసులో దాఖలు చేసిన చార్జిషీటు కీలక విషయాలను వెల్లడించింది. ఇంటి ముందు పేలుడుపదార్థాలు ఉన్నట్టు తెలియగానే ముఖేశ్ అంబానీ కుటుంబం వ్యవహరించిన తీరునూ పేర్కొన్నట్టు తెలిసింది.
ఎన్ఐఏ చార్జిషీటులో ముఖేశ్ అంబానీ నివాసం సెక్యూరిటీ హెడ్ స్టేట్మెంట్ కూడా ఉన్నది. నివాసం ముందు పార్క్ చేసిన ఎస్యూవీ కారులో పేలుడు పదార్థాలు ఉంచినట్టు తేలడం, ఓ బెదిరింపు లేఖ ఉన్నట్టు తెలియగనే సెక్యూరిటీ హెడ్ వెంటనే ముఖేశ్ అంబానీకి తెలియజేసినట్టు వివరించారు. అదే రోజు నీతా అంబానీ గుజరాత్లోని జామ్నగర్కు వెళ్లాల్సి ఉంది. కానీ, ఆ ట్రిప్ను ఆమె వాయిదా వేసుకున్నట్టు తెలిపారు. అనంతరం, ముఖేశ్ అంబానీ, జోనల్ డీసీపీ సూచనల మేరకు ఆ ట్రిప్ను నీతా అంబానీ పూర్తిగానే రద్దు చేసుకున్నట్టు వివరించారు. ఆ తర్వాత కూడా తమకు నిత్యం బెదిరింపు కాల్స్ వచ్చాయని, అందులో చాలా వరకు రైతు ఆందోళనలకు సంబంధించినవేనని పేర్కొన్నారు. అయితే, ఆ బెదిరింపు ఘటనకు సంబంధించి అంబానీ కుటుంబం ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదని వివరించారు.
ఈ కేసులో మాజీ ముంబయి పోలీసు అధికారి సచిన్ వాజే ప్రధాన నిందితుడిగా ఉన్నారు. తాను ‘సూపర్ కాప్’ అని పేరు తెచ్చుకోవడానికే అంబానీ నివాసం ముందు పేలుడుపదార్థాలతో కారు ఉంచారని ఎన్ఐఏ ఆరోపించింది. ఈ కారు తన దగ్గర నుంచి దొంగిలించారని పేర్కొన్న వ్యాపారి మన్సుఖ్ హిరేన్ హత్య కేసులోనూ సచిన్ వాజే పేరు ఉన్నది.