
President of India Ram Nath Kovind: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో కొడుకులు, కూతుళ్లకు సమాన హోదా కల్పించామని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలలో మహిళా సాధికారత ఒకటని కూడా స్పష్టం చేశారు. పురుషుల మాదిరిగానే మహిళలు పెళ్లి (Minimum legal age of marriage for women) చేసుకునే కనీస వయస్సును సైతం 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచేందుకు ప్రభుత్వం పార్లమెంట్ (Parliament)లో బిల్లును ప్రవేశపెట్టిందని Ram Nath Kovind పేర్కొన్నారు. ఉజ్వల యోజన విజయానికి మనమే సాక్షులమని తెలిపారు. ముద్రా యోజన ద్వారా, మహిళల వ్యవస్థాపకత, నైపుణ్యాలు ఊపందుకున్నాయని చెప్పారు.
‘బేటీ బచావో, బేటీ పఢావో’ (Beti Bachao Beti Padhao) పథకంతో అనేక సానుకూల ఫలితాలు కనిపించాయని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ (Ram Nath Kovind) తెలిపారు. ట్రిపుల్ తలాక్ (triple talaq)ను నేరంగా పరిగణించడం ద్వారా అక్రమ పద్ధతుల నుండి ముస్లిం మహిళలకు విముక్తి దిశగా ప్రయత్నాలు చేసిందని తెలిపారు.
టోక్యో ఒలంపిక్స్ లో భారత యువశక్తిని యావత్ ప్రపంచం చూసిందని పేర్కొన్న రాష్ట్రపతి.. కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతున్న ఈ మూడేండ్ల కాలంలో దేశ ప్రజలు ప్రజాస్వామ్య విలువలు, క్రమశిక్షణ, బాధ్యత భావం పట్ల ప్రగాఢ విశ్వాసాన్ని ప్రదర్శించారని తెలిపారు. అలాగే, భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమృత్ మహోత్సవ్ను జరుపుకుంటున్న తరుణంలో, ప్రతి భారతీయుడి ఈ సంకల్ప శక్తి భారతదేశ ఉజ్వల భవిష్యత్తుపై అపారమైన విశ్వాసాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఇదే ఈ విశ్వాసంతో పార్లమెంటులోని ఈ చారిత్రాత్మక సెంట్రల్ హాల్ నుండి ప్రతి భారతీయుడికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు.
అలాగే, భారతదేశ హక్కులను కాపాడిన లక్షలాది మంది స్వాతంత్య్ర సమరయోధులకు తాను వందనం చేస్తున్నానని తెలిపారు. ఈ 75 సంవత్సరాల స్వాతంత్య్రంలో మన దేశ అభివృద్ధి-ప్రయాణంలో వారు చేసిన కృషికి గొప్ప వ్యక్తులందరికీ నమస్కరిస్తున్నాని తెలిపారు. ఈ అమృత మహోత్సవ్ కాలంలో దేశంలోని గొప్ప వ్యక్తులకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు మనకు స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. "గురు తేజ్ బహదూర్ జీ 400వ ప్రకాష్ పర్వ్, శ్రీ అరబిందో 150వ జయంతి, వీఓ చిదంబరం పిళ్లై 150వ జయంతి, నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలను నా ప్రభుత్వం ఘనంగా జరుపుకుంటోంది. ఈ ఏడాది నుంచి నేతాజీ జయంతి అయిన జనవరి 23 నుంచి గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ప్రారంభించింది" అని తెలిపారు. దేశ సురక్షితమైన భవిష్యత్తు కోసం గతాన్ని గుర్తుంచుకోవడం, దాని నుండి నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యమని ప్రభుత్వం విశ్వసిస్తోందని తెలిపారు.