
India Pakistan : ఇండియా, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. చాలా ఏళ్లుగా ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు లేవు... ఇలాంటి సమయంలో కశ్మీర్ లో ఉగ్రదాడి అలజడి రేపింది. పహల్గాంలో అమాయక టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని భారత్ చాలా సీరియస్ గా తీసుకుంది... దీనివెనక పాకిస్థాన్ హస్తం ఉందని బలంగా నమ్ముతోంది. ఈ క్రమంలోనే పాక్ పై ఆంక్షలు విధించింది... ఇండియాలో పాక్ పౌరులు ఉండకూడదంటూ వీసాల రద్దు నిర్ణయం తీసుకుంది.
పాకిస్థాన్ పౌరులు భారత్ ఏప్రిల్ 27 లోపు భారత్ ను వీడాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. మెడికల్ వీసాలపై వచ్చినవారు మాత్రం ఏప్రిల్ 29 లోపు వెళ్లిపోవాలని ఆదేశించింది. అంతేకాదు అన్ని రాష్ట్రాలకు పాకిస్థాన్ పౌరులను గుర్తించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇలా స్వతహాగా కొందరు పాకిస్థానీలు భారత్ ను వీడితే మరికొందరికి బలవంతంగా పంపించారు. ఇలా వాఘా బార్డర్ నుండి పాకిస్థాన్ కు వెళ్ళిపోతున్నారు.
అయితే ఇప్పటివరకు దాదాపు 537 మంది పాకిస్థానీలు అటారీ-వాఘా సరిహద్దు నుండి భారత్ ను వీడినట్లు తెలుస్తోంది. అయితే ఇవాళ పాకిస్థానీలు భారత్ ను వీడేందుకు చివరిరోజు కావడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గడువు దాటినతర్వాత కూడా భారతదేశంలోనే ఉండే పాకిస్థానీలను కఠినంగా శిక్షిస్తామని హోంశాఖ హెచ్చరిస్తోంది.
భారత్ నుండి పాకిస్థాన్ కు వెళ్లినవారి కంటే పాకిస్థాన్ నుండి భారత్ కు వచ్చినవారే ఎక్కువగా ఉన్నారు. భారత చర్యలకు ప్రతిచర్యగా పాకిస్థాన్ కూడా ఇండియన్స్ ను తమదేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. దీంతో అటారీ-వాఘా సరిహద్దు నుండి పాకిస్థాన్ లోని భారతీయులు తిరిగివచ్చారు. ఇలా 850 మంది భారతీయులు పాక్ నుండి తిరిగి వచ్చినట్లు సరిహద్దు సిబ్బంది తెలిపారు.
మెడికల్ వీసాలపై భారత్ లో వైద్యం కోసం చాలామంది పాకిస్థానీలు వస్తుంటారు. ఇలాంటివారంతా ఇవాళ భారత్ ను వీడాల్సి ఉంటుంది. లేదంటే వీరిని 'ఇమ్మిగ్రేషన్ ఆండ్ ఫారినర్స్ యాక్ట్-2025' కింద అరెస్ట్ చేస్తారు. ఈ చట్టం కింద అరెస్టయినవారికి మూడేళ్లు జైలుశిక్ష, రూ.3 లక్షల వరకు జరిమానా ఉంటుంది. ఇలా సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే వెంటనే భారత్ ను వీడాలని పాకిస్థానీ పౌరులను భారత్ హెచ్చరిస్తోంది.