
2002 నరోడా గామ్ ఊచకోత కేసులో నిర్దోషిగా తేలిన బీజేపీ నేత, మాజీ మంత్రి మాయా కొద్నానీ నెక్ట్స్ ఏం చేయబోతున్నారోనని గుజరాత్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోర్టులో కేసుల నేపథ్యంలో మాయా పొలిటికల్ గ్రాఫ్ పూర్తిగా క్షీణించింది. ఒకప్పుడు మోడీ కేబినెట్లో సభ్యురాలిగా.. రాజకీయాల్లో అప్పుడప్పుడే ఎదుగుతున్న దశలో మాయ జీవితాన్ని గుజరాత్ అల్లర్లు మలుపు తిప్పాయి. అయితే మాయా కొద్నానీ రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశించాలనుకుంటే ఆమెకు పార్టీ ఖచ్చితంగా కీలక బాధ్యతలు అప్పగిస్తుందని.. గుజరాత్ బీజేపీ నేతలు చెబుతున్నారు.
గోద్రా అల్లర్లు చోటు చేసుకున్న తర్వాత ఫిబ్రవరి 28, 2002 నరోదా గామ్ అల్లర్ల కేసులో 11 మంది మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తుల మరణానికి కారణమైన కేసులో గురువారం 68 ఏళ్ల కొద్నానీని ప్రత్యేక కోర్ట్ నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఇదే కేసులో మాయా కొద్నానీని ఏప్రిల్ 2018లో గుజరాత్ హైకోర్టు సైతం క్లీన్ చిట్ ఇచ్చింది. నరోడా పాటియా గ్రామంలో జరిగిన అల్లర్లలో 97 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఆమెను కింగ్ పిన్గా అభివర్ణించారు. ఇదే సమయంలో ప్రత్యేక కోర్ట్ 2012 ఆగస్టులో మాయా కొద్నానీకి జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును హైకోర్టు తోసిపుచ్చింది.
అల్లర్లు చోటు చేసుకున్న రెండు ప్రాంతాలు ఒకప్పుడు మాయా కొద్నానీ ప్రాతినిథ్యం వహించిన అసెంబ్లీ నియోజకవర్గంలో భాగంగా వున్నాయి. హైకోర్ట్ గతంలో ఆమెను నిర్దోషిగా ప్రకటించినప్పుడు కొద్నానీ పలుమార్లు బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డిసెంబర్ 2022లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కనిపించారు. అంతేకాదు ఆ సమయంలో బీజేపీ అగ్రనాయకత్వంతో ఆమె వేదికను పంచుకున్నారు. అయితే ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో పాల్గొనాలా వద్ద అనేది మాయా వ్యక్తిగతమని బీజేపీ నేత ఒకరు మీడియాకు తెలిపారు.
Also Read: 2002 నరోడా ఊచకోత కేసు : 21 ఏళ్ల తర్వాత తుది తీర్పు, 68 మందిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్ట్
జంట అల్లర్ల కేసులను ఎదుర్కొంటున్న కొద్నానీ.. మార్చి 27, 2009న గుజరాత్ హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో అప్పటి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం మాయా కొద్నానీ పోలీసులకు లొంగిపోయారు. అయితే గోద్రా రైలు మారణ హోమంతో పాటు నరోదా గామ్, నరోదా పాటియాలలో నమోదైన ఇతర అల్లర్ల కేసులపై సుప్రీంపోర్ట్ నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిపింది. 2012లో నరోడా పాటియా ఊచకోత కేసులో ప్రత్యేక న్యాయస్థానం ఆమెకు జీవిత ఖైదు విధించినప్పుడు మాయా కొద్నానీ సిట్టింగ్ ఎమ్మెల్యే.
వృత్తి రీత్యా వైద్యురాలైన మాయా కొద్నానీ బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చి కీలక నేతగా ఎదిగారు. 1990లలో స్టాండింగ్ కమిటీ ఛైర్పర్సన్గా పనిచేశారు. 1998లో అహ్మాదాబాద్లోని నరోడా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిని 75000 ఓట్ల తేడాతో ఓడించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2002 అల్లర్ల తర్వాత అదే ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాయా కొద్నానీ అదే నియోజకవర్గం నుంచి లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
2003లో ఆమెను బీజేపీ అహ్మదాబాద్ యూనిట్ అధ్యక్షురాలిగా నియమించారు. 2007లో నరోడా నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా మారారు. ఈసారి 1.80 లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో ఆమె గెలిచారు. అంతేకాదు.. నరేంద్ర మోడీ కేబినెట్లో స్త్రీ , శిశు సంక్షేమ, ఉన్నత విద్యాశాఖ సహాయ మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. అయితే సుప్రీంకోర్ట్ నియమించిన సిట్ దర్యాప్తులో విచారణను ఎదుర్కొనడంతో 2009లో మాయా కొద్నానీ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆమె రాజకీయ జీవితానికి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.